ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు అదిరే శుభవార్త చెప్పింది. పీఎఫ్ ఖాతాదారులు తమ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి తదితర వివరాల్లో మార్పులు చేసుకునేందుకు ఉన్న ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై యజమాని (ఎంప్లాయర్) గానీ, ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే ఆన్లైన్ ద్వారా ఈజీగా వివరాలు మార్చుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇ-కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ అకౌంట్లను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు సైతం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం ప్రారంభించారు.
ఈ రెండు ప్రక్రియలు అందుబాటులోకి రావడం వల్ల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ప్రక్రియ మరింత సులభతరమవడంతో పాటుగా కంపెనీలపై పని ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈపీఎఫ్ఓ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలైన పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేసిన తేదీ వంటి వివరాల విషయంలో తప్పులు దొర్లుతాయి. వాటిని మార్చుకునేందుకు కంపెనీ యాజమాన్యాల ఆమోదం అవసరం . దీంతో చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆ ప్రక్రియను సులభతరం చేసింది ఈపీఎఫ్. 2017, అక్టోబర్ 1 తర్వాత జారీ అయిన యూఏఎన్ చందాదారులు ఈ కొత్త సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదని కేంద్ర మంత్రి తెలిపారు.
అయితే, 2017, అక్టోబర్ 1 కంటే ముందు జారీ అయిన యూఏఎన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేగుండా కంపెనీ యాజమాన్యాలే అవసరమైన మార్పులు చేయొచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను సైతం తగ్గించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆధార్తో లింక్ చేయని యూఏఎన్ అకౌంట్ల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుందన్నారు.
అకౌంట్ ట్రాన్స్ఫర్..
ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇ-కేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ఉద్యోగం మారని సమయంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్టులు ఈపీఎఫ్కు చేరడానికి 12-13 సమయం పడుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. తాజా నిర్ణయంతో ఆ గడువు తగ్గుతుందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa