ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్ట్ర రహదారుల విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ వస్తోందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి, వాడరేవు - పిడుగురాళ్ల మధ్య నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే గుంటూరు జిల్లాలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని అధికారులు భావిస్తున్నారు. కొండమోడు - పేరేచర్ల జాతీయ రహదారి పనుల కోసం రూ. 881 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే వాడరేవు - పిడుగురాళ్ల నాలుగు వరసల రహదారి పనులు కోసం రూ.1.064.24 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిని (167-A) నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మొత్తం 85 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. నకరికల్లు వద్ద అద్దంకి - నార్కట్పల్లి రోడ్డును, చీరాల వద్ద 216 జాతీయ రహదారిని, చిలకలూరిపేట సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా ప్రణాళికలు రచించారు. అయితే రెండు ప్యాకేజీలుగా ఈ వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ఒక ప్యాకేజీ, చిలకలూరిపేట నుంచి నకరికల్లు వరకు రెండూ ప్యాకేజీగా విభజించారు.
అలాగే వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకూ 18 కిలోమీటర్ల మేరకు కొత్త రోడ్డును నిర్మించనున్నారు. అలాగే పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేటలలో బైపాస్ రోడ్ల నిర్మాణం జరగనుంది. ఈ పనులు పూర్తి అయితే చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు, బాపట్ల, వాడరేవు వద్ద బీచ్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు కలుగుతాయి.ప్రస్తుతానికి రహదారి విస్తరణపై సర్వే పూర్తి కాగా.. బైపాస్లు, వంతెనలు, సర్వీసు రోడ్లకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించారు. ఇప్పటికే కొన్నిచోట్ల భూసేకరణ కొలిక్కిరాగా.. కొన్నిచోట్ల ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు.
ఇక కొండమోడు - పేరేచెర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి.. 49.91 కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. పేరేచర్ల నుంచి కొండమోడు వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. గుంటూరు నుంచి హైదరాబాద్, పల్నాడు వెళ్లేవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా కొండమోడు నుంచి గుంటూరులోని పేరేచర్ల వరకు జాతీయ రహదారి(167ఏజీ)గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా కొండమోడు నుంచి రాజుపాలెం, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, మేడికొండూరు మీదుగా పేరేచెర్ల వరకూ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. అలాగే ఈ రోడ్డును అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తారు. వైసీపీ హయాంలో నిధులు మంజూరైనా.. విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే గుంటూరులో అనుసంధానం మరింత మెరుగుపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa