ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ సంచారం విషయం కీలక ట్విస్ట్ తిరిగింది. అసలు ఆ డ్రోన్ ఎక్కడిది.. ఎవరు ఎగరేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ డ్రోన్ ఎవరు ఎగరవేశారనేదానిపై క్లారిటీ వచ్చింది. అసలు విషయంలోకి వస్తే.. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ సంచారం శనివారం కలకలం రేపింది. పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల నుంచి ఒంటి గంటా 50 నిమిషాల మధ్య డ్రోన్ తిరిగింది. అలాగే నిర్మాణంలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయంపైనా డ్రోన్ సంచరించినట్లు జనసేన నేతలు చెప్పారు. ఇదే విషయమై ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా డ్రోన్ సంచారంపై ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. అసలా డ్రోన్ ఎవరిది.. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు మొదలెట్టారు. రెండు రోజులుగా డ్రోన్ సంచారంపై లోతైన దర్యాప్తు జరిపారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఈ విషయంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇంటి మీద డ్రోన్ ఎగిరిందా లేదా అనేది తెలియాల్సి ఉందని.. సోమవారం సాయంత్రంలోగా ఈ అంశంపై విచారణ కొలిక్కి వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లుగానే జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ ఎవరిదనేదీ పోలీసులు గుర్తించారు.
మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా పోలీసులు తేల్చారు. రోడ్ల పరిస్థితి, మురికి కాల్వల నిర్వహణ, వాహనాల రాకపోకలు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం జరుపుతోంది. ఇందుకోసం మంగళగిరి నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకుంది. ఈ విషయాలపై సర్వేల కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అలాంటి డ్రోనే ఒకటి శనివారం జనసేన కేంద్ర కార్యాలయం, టీడీపీ కార్యాలయంపై ఎగిరినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గుర్తు తెలియని డ్రోన్ ఎవరు ఎగరేశారా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది.
అయితే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో జనసేన శ్రేణులు డ్రోన్ అంశంలో ఆందోళన చెందాయి. మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో నకిలీ ఐపీఎస్ అధికారి తిరగడం, విజయవాడ బుక్ ఫెస్టివల్లో పవన్ కళ్యాణ్ స్టాల్స్లో ఉన్న సమయంలోనే పవర్ కట్ వంటి ఘటనల నేపథ్యంలో డ్రోన్ సంచారంపైనా ఆందోళన చెందారు. అయితే అది ప్రభుత్వం ఎగరేసిన డ్రోన్ అని తెలియడంతో ఆందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa