ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు కేటాయించిన ఓ ప్రత్యేక రైలుపై ప్రయాణికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అందులో ఎక్కాల్సింది పోయి ఆ రైలుపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. మధ్య ప్రదేశ్లోని జాన్సీ జిల్లా చతర్పుర్ రైల్వే స్టేషన్కు కుంభమేళా స్పెషల్ రైలు వచ్చి ఆగింది. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో అక్కడ ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కుంభమేళాకు వెళ్లేందుకే రైలు కోసం వేచి చూశారు. అయితే రైలు వచ్చి ఆగిన వెంటనే తలుపులు తీయబోయారు. కానీ అవి ఎంతకూ తెరుచుకోకపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలోనే రైల్లో ఉన్నవాళ్లే తలుపులు మూసినట్లు గుర్తించి వెంటనే రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తలుపులు తెరవమని చెబుతూనే తలుపులు, కిటికీలను పగులగొట్టారు.
విషయం గుర్తించిన పోలీసులు వెంటనే వచ్చి ప్రయాణికులను ఆపారు. రైలుపై దాడి చేయొద్దని కోరుతూనే.. మీ సమస్య చెప్పమని అడిగారు. దీంతో రైళ్లో ఉన్న ప్రయాణికులు తలుపులు, కిటికీలు మూసేశారని.. తమను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఆపై పోలీసులు రైలు తలుపులు తెరిచి ఎందుకు ఇతర ప్రయాణికులను ఎక్కనివ్వట్లేదని ప్రశ్నించగా.. ఇప్పటికే రైళ్లో అనేక మంది ఉన్నట్లు లోపలి ప్రయాణికులు చెప్పారు. ఇంకా ఎక్కువ జనాలు ఇందులోకి ఎక్కితే చాలా కష్టం అవుతుందనే అలా చేసినట్లు వివరించారు.
దీంతో పోలీసులు బయట ఉన్న ప్రయాణికులను శాంతింప జేశారు. మరో రైలు ద్వారా మీరంతా కుంభమేళాకు వెళ్లాలని సూచించారు. కానీ పలువురు రేపటి లోపు కుంభమేళా వెళ్లాలని.. లోపల ఎంత మంది ఉన్నా పట్టించుకోకుండా ఎక్కేయగా.. మరికొందరు మాత్రం అక్కడే ఆగిపోయారు. ఈ విషయాన్ని నేరుగా జాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వీ మనోర్ కుమార్ సింగ్ తెలిపారు. చతర్పుర్తో పాటు హర్పల్పుర్ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటి దాడి జరిగినట్లు వెల్లడించారు. అంతేకాకుండా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటామని వివరిస్తున్నారు.
ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరూ కుంభమేళాకు ఇంత మంది వెళ్తున్నారా.. రేపు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా.. కుంభమేళాలో దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది యూపీ సర్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa