కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కల్లుగీత, గౌడ్ సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేసిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవలంభిస్తున్న విధానాలపై గౌడ సంఘం ప్రతినిధులతో శుక్రవారం కాకాణి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.... మద్యం షాపుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న అక్రమ విధానాలతో గౌడ్ కులస్తులకు అన్యాయం జరుగుతుంది.చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పదేపదే రాష్ట్రంలో 50శాతం రాయితీతో 10 శాతం షాపులు కల్లుగీత సొసైటీలకు కేటాయిస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గీత కులాల పేరుతో ఫిబ్రవరి 5వ తేదీ లోపు ప్రభుత్వం కేటాయించిన ప్రాంతాలలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ గెజిట్ విడుదల చేశారు.జిల్లాలోని మొత్తం మద్యం షాపులలో 10 శాతం అనగా 18 షాపులు గీత కులాలకు కేటాయించారు.వ్యాపారం జరిగి ఆదాయం బాగా వచ్చే ప్రాంతాలలో కాకుండా, మారుమూల ప్రాంతాలలో గౌడ్ సామాజిక వర్గానికి మద్యం షాపులు కేటాయించడం అన్యాయం.వ్యాపారం జరిగే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఒకే ఒక్క మద్యం షాపు గీత కులాలకు కేటాయించి, నెల్లూరుకు కూత వేటు దూరంలో ఉన్న సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గంలో ఒక్క షాపు కూడా కేటాయించకపోవడం గౌడు కులస్తులకు తీరని ద్రోహం చేయడం.
సర్వేపల్లి నియోజకవర్గంలో 28 మద్యం షాపులలో గీత కులాలకు ఒక్క షాపు కూడా కేటాయించలేదు.జనాభా ప్రాతిపదికన మద్యం షాపులు కేటాయించామన్న అధికారులు, వ్యాపారం జరగవని వదిలేసిన ప్రాంతాలలో గీత కులాలకు షాపులు కేటాయించారు.
గీత కులాలకు ఇచ్చిన షాపులను కూడా సబ్ కులాల వారీగా విభజించి, తీరని అన్యాయం చేస్తున్నారు.ఎమ్మెల్యేల కన్నుసన్నలలో ఎక్సైజ్ అధికారులు పనిచేయడం దురదృష్టకరం.గీత కులాల మద్యం షాపుల కేటాయింపులో ఎమ్మెల్యేల అనుమతి లేనిదే అధికారులు షాపు లైసెన్స్ కేటాయించడం లేదు.స్థానిక ఎమ్మెల్యేకు వాటాలు కేటాయిస్తే తప్ప, అనుమతులు వచ్చే పరిస్థితి లేదు.సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి, గౌడ్ కులస్తుల ఓట్లు దండుకొని, మద్యం షాపుల కేటాయింపులో సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక్క షాపు కూడా కేటాయించకపోవడం అన్యాయం.సర్వేపల్లి నియోజకవర్గంలో 3వ వంతు వాటా సోమిరెడ్డికి ఇస్తే తప్ప, షాపులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది.గౌడ్ కులస్తులకు అన్యాయం జరుగుతున్నా.. వారు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం.మండలాలను యూనిట్ గా తీసుకొని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన షాపులలో 10 శాతం గీత కులాలకు షాపులు కేటాయించాలి.గౌడ్ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై గౌడ కులస్తుల తరపున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి, వారి కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని కాకాణి గోవర్ధన్రెడ్డి భరోసా కల్పించారు.