గద్దెను ఎక్కిన రోజే జన్మతః పౌరసత్వం రద్దుచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సియాటెల్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. తాజాగా, మరోసారి ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జన్మతః పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే అప్పట్లో తీసుకొచ్చారని తెలిపారు. అంతేకానీ, యావత్ ప్రపంచం ఇక్కడికి వచ్చి పోగుపడటానికి ఉద్దేశించింది కాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. అక్కడ తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్లూ ఇక్కడికి వస్తున్నారు... అర్హతలేని వారు ఇక్కడికి వచ్చి పిల్లలను కంటున్నారు.. వాస్తవానికి జన్మతః పౌరసత్వం ఉద్దేశం అదికాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘జన్మతః పౌరసత్వం అనేది అమెరికాకు బానిసలుగా వచ్చిన వారి పిల్లల కోసం కల్పించిన ఉదాత్తమైన సౌకర్యం.. అది 100 శాతం నాకు సమ్మతమే. ఇది ప్రపంచం మొత్తం వచ్చి అమెరికాను ఆక్రమించుకోడానికి ఉద్దేశించింది కాదు’ అని వివరించారు. వలస వచ్చిన వారు అమెరికా గడ్డపై పిల్లలను కంటే వారికి సహజంగా ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ మొదటి రోజునే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ఉండగా.... వీరిలో మూడో వంతు అమెరికాలో పుట్టినవారే.
ఇదే సమయంలో బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయన్ని చూసుకుంటోన్న ప్రయత్నాలపై కూడా ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్కు బదులుగా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటే తమకు ఎగుమతులు చేసే ఆయా దేశాల ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ కూటమిలో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్, యూఏఈలు సభ్యదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. బ్రిక్స్ డాలర్ను త్యజిస్తే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa