పక్క రాష్ట్రంలో జరిగిన తన బంధువుల ఇంట వివాహానికి వెళ్లి తిరిగొస్తుండగా మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయాలుకాగా.. ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా సర్దారేవాలాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని ఫజిల్కా జిల్లాలో బంధువుల ఇంట జరిగిన పెళ్లికి హాజరైన 14 మంది శుక్రవారం రాత్రి పొద్దుపోయాక తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఫతేబాద్ జిల్లా సర్దారేవాలా గ్రామం వద్దకు రాగేన జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో తొమ్మిది మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టాయి. కాల్వలో గాలింపు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.
దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. మార్గం కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన మిగతా ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ జగదీశ్ చంద్ర మాట్లాడుతూ.. గత రాత్రి పంజాబ్లో వివాహానికి వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఆరు మృతదేహాలను వెలికితీశామని, మిగతా వాటికోసం గాలింపు కొనసాగుతోందని ఆయన వివరించారు. ఘటన దట్టమైన మంచు వల్లే జరిగినట్టు భావిస్తున్నామని అన్నారు. మరోవైపు, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa