తిరుపతి ప్రశాంతత, ప్రతిష్టను టీడీపీ కూటమి ప్రభుత్వం మంట గలుపుతోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి వైయస్ఆర్సీపీకార్పొరేటర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. బాధ్యత వహించాలంటూ రోజా డిమాండ్ చేశారు. తిరుపతి పరువు, ప్రతిష్ట, ప్రశాంతతను మంటగలపడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తోన్నారంటూ ఆమె ధ్వజమెత్తారు.గతంలో తిరుమల లడ్డూ మొదలుకుని టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాటలో ఆరుమంది మరణించడం, ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లు, మేయర్, దళిత ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిపై దాడులు చేయడం వరకు జరిగిన ఉదంతాలు దీనికి నిదర్శనమని అన్నారు.
ఒకవైపు వైయస్ఆర్సీపీ నాయకులు తమకు అక్కర్లేదంటూ మంత్రి నారా లోకేష్ చెబుతూ.. డిప్యూటీ మేయర్ పదవి కోసం దాడులు చేయిస్తోన్నాడంటూ నిప్పులు చెరిగారు. కార్పొరేటర్లను బూతులు తిట్టారని, వాళ్లను రాళ్లతో కొట్టారంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తోండగానే జరిగాయని అన్నారు.జనసేనకు చెందిన తిరుపతి ఎమ్మెల్యే ఇంతగా దిగజారిపోయి తమ పార్టీ కార్పొరేటర్ల కిడ్నాప్కు పాల్పడుతున్నాడో ఒక్కసారి గమనించాలంటూ పవన్ కల్యాణ్కు రోజా హితవు పలికారు. ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం తిరుపతిలో ఇంతగా దౌర్జన్యానికి పాల్పడటం చూస్తోంటే కూటమిది ఈవీఎంల ప్రభుత్వం అని మరోసారి రుజువైందని రోజా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa