ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు సొంత బలం లేకపోయినా కూటమి నేతలు రెచ్చిపోతున్నారని, వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడిన ఘటనపై భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.
సోమవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైయస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు.
కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.