ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ యువతితో దుబాయ్‌లో ప్రేమ... ఆపై ఊహించని ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 07:44 PM

దుబాయిలో ఉపాధికోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ మహిళ.. కర్ణాటకకు చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. ఇరువురి మతాలు వేరైనా కలిసి జీవించాలని భావించారు. దీంతో స్వదేశానికి వచ్చి మతాంతర వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లైన 20 రోజులకే భార్యతో గొడవపడిన అతడు.. ఆమె నగలు, నగదు, ఇతర పత్రాలు తీసుకుని పరారయ్యాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ.. నాలుగేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్ వెళ్లింది. ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపురకు చెందిన ఆరిఫ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. సొంతూరికి వెళ్లి పెళ్లిచేసుకోవాలని భావించారు.


దీంతో గత నెలలో ఆరిఫ్‌, చిత్తూరు యువతి విజయపురకు వచ్చారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజుల నుంచి ఆరిఫ్ కుటుంబసభ్యులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. విడాకులు (తలాక్) ఇవ్వాలని బలవంతపెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అనంతరం ఆరిఫ్.. ఆమెతోనే ఉంటానని చెప్పి తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. రెండు మూడు రోజుల తర్వాత ఆ మహిళకు మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. చివరకు బురనాపురలోని ఇంటికి అద్దెకు తీసుకుని ఈ జంట కాపురం పెట్టింది. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా గొడవపడ్డారు.


ఈ క్రమంలో తన బంధువులను తీసుకొచ్చి.. భార్యను కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె నగలు, డబ్బులు, పాస్‌పోర్టు, మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత అతడి కుటుంబసభ్యులు వచ్చి.. ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో రెండు రోజుల కిందట బాధితురాలు విజయపుర గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేసింది. ప్రేమ, పెళ్లి పేరుతో తాను నిలువునా మోసపోయానని వాపోయింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యమని కన్నీళలు పెట్టుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు... నిందితుని కోసం గాలింపు తీవ్రం చేశారు. అతడి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఆరిఫ్ కుటుంబసభ్యులను విచారిస్తే ఆచూకీ తెలిసే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే అతడ్ని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com