అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. తాజాగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. లఖ్నవూలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారట. మధుమేహంతో పాటు బీపీ కూడా ఎక్కువ కాగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కూడా వైద్యానికి స్పందిస్తున్నప్పటికీ.. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అయోధ్య రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్కు ప్రస్తుతం 85 ఏళ్లు. ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉన్న ఈయనకు ఆదివారం రోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈక్రమంలోనే అతడిని లఖ్నవూలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి వైద్యులు సైతం సత్యేంద్ర దాస్కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పూజారి కూడా వారి చికిత్సకు స్పందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా మహంత్ సత్యేంద్ర దాస్ మధుమేహంతో పాటు బీపీతో బాధ పడుతున్నారని SGPGI వైద్యులు చెబుతున్నారు. ఆదివారం రోజు ఆస్పత్రిలో చేరిన సత్యేంద్రను ఐసీయూలో ఉంచగా.. ప్రస్తుతం న్యూరాలజీకి చెందిన హై డిపెండెన్సీ యూనిట్కు మార్చినట్లు వివరించారు. అనుక్షణం అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని కూడా వెల్లడించారు.
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రా మసీదు కూల్చి వేసిన సమయంలో తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా పని చేశారు ఆచార్య సత్యేంద్ర దాస్. 20 ఏళ్ల వయసులోనే నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్న ఈయన.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం అయోధ్య రామాలయ ప్రధాన పూజారిగా పని చేస్తున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలియడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా బయటకు రావాలని అయోధ్య బాల రాముడిని కోరుతున్నట్లు కూడా తెలుపుతున్నారు.