ఏపీలోని ప్రైవేటు పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తియ్యని కబురు చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి నారా లోకేశ్ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోటీ పడదాం... అందరం కలిసి విద్యావ్యవస్థను బలోపేతం చేద్దాం అని పిలుపునిచ్చారు. "కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది. విద్యాశాఖ మంత్రిగా నాపై పవిత్ర బాధ్యత ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వలన లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావడంతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం. వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పాఠశాల విద్యలో సంస్కరణలపై మేం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళుతున్నాం. నేను ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నా. వైసీపీ పాలనలో గందరగోళంగా మారిన విద్యావ్యవస్థను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం. మేం చిత్తశుద్ధితో చేయాలనే తపనతో ఉన్నాం.విద్యా రంగంలో ప్రైవేటుకు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. యువగళం పాదయాత్ర సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు అనేకం నా దృష్టికి వచ్చాయి. పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతాం. ప్రైవేటు స్కూల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం" అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa