ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుకు,,,టీమ్‌కు రూ.5 కోట్లు ప్రైజ్‌మనీగా ప్రకటించిన బీసీసీఐ

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 09:39 PM

వరుసగా రెండోసారి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత జట్టును బీసీసీఐ అభినందించింది. ఈ మేరకు ప్రశంసలతో పాటు ప్రైజ్‌మనీని కూడా అందించింది. దీనిపై ఫైనల్ మ్యాచ్ జరిగాక ప్రకటన చేసింది. విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు రూ.5 కోట్లు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


"టీ20 ప్రపంచకప్ 2025‌ గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా వారు టైటిల్ నిలబెట్టుకున్నారు. ఈ చిరస్మరణనీయ విజయానికి గుర్తింపుగా.. బీసీసీఐ తరఫున రూ.5 కోట్ల ప్రైజ్‌మనీని ఇస్తాం. భారత మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌ నూషిన్‌ అల్‌ ఖదీర్‌, కెప్టెన్‌ నికీ ప్రసాద్‌కు శుభాకాంక్షలు" అని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది.


"భారత మహిళల జట్టు ప్రదర్శన అద్భుతం. వారంతా ఈరోజు దేశంలోని కోట్లాది మంది గర్వపడేలా చేశారు. ఈ ట్రోఫీ.. భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్ధికి ఊతంగా పనిచేస్తుంది" అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పేర్కొన్నారు. "వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలవడం అంత ఈజీ కాదు. ఈ విజయం భారత మహిళల జట్టులోని ప్లేయర్ల కృషికి, పట్టుదలకు నిదర్శనం" అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రశంసించారు.


కాగా ఆదివారం మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా.. వరుసగా ఏడు మ్యాచుల్లో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత బౌలర్ల దెబ్బకు సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన తెలుగమ్మాయి గొంగడి త్రిష బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 33 బంతుల్లో 44 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.


కాగా ఐసీసీ టోర్నీల్లో టైటిల్ సాధించిన ఏ జట్టుకైనా.. డబ్బు రూపంలో రివార్డ్ వస్తుంది. కానీ ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం అండర్-19 స్థాయిలో ప్రపంచ కప్‌ విజేతలకు ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. దీంతో భారత మహిళల జట్టుకు కేవలం ట్రోఫీ, పతకాలు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాత్రం రూ.5 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. 2023లో భారత మహిళలు ఛాంపియన్‌గా నిలిచినప్పుడు కూడా ఇంతే మొత్తంలో ప్రోత్సాహకం అందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com