బడ్జెట్లో వేతనజీవులకు ఉపశమనం కలిగించేలా ఆదాయపు పన్నుపై కేంద్రం భారీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రూ.12 లక్షల వరకూ ఎటువంటి పన్ను ఉండబోదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇదే అంశంపై ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో భారీగా పన్నులు వసూలు చేశారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒకవేళ, నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ.12 లక్షల జీతం వస్తే.. నాలుగో వంతు ఆదాయపు పన్ను రూపంలోనే పోయేదని ఆరోపించారు. అలాగే, ఇప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నా అదే జరిగేదని ఎద్దేవా చేశారు.
‘‘జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ. 12 లక్షల జీతం ఉంటే నాలుగో వంతు పన్ను చెల్లించాల్సి ఉండేది.. నేడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉండుంటే మీ రూ. 12 లక్షలలో రూ. 10 లక్షలు ప్రభుత్వానికి పన్నుగా వెళ్లి ఉండేది.. అంతేకాదు.. 10-12 సంవత్సరాల కిందట కాంగ్రెస్ కాలంలో కూడా మీకు రూ. 12 లక్షల జీతం అయితే రూ. 2.6 లక్షలు పన్నుగా వెళ్లి ఉండేది... బీజేపీ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టి బడ్జెట్ తర్వాత రూ. 12 లక్షలు సంపాదించేవారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రూ.12 లక్షల వరకూ ఎటువంటి పన్ను విధించకపోవడంతో మధ్యతరగతి సంబరాలు చేసుకుంటోంది. ఇది వినియోగాన్ని పెంచుతుందన్న విశ్లేషకులు.. కానీ ద్రవ్యోల్బణం పెరుగుదల గురించి కూడా హెచ్చరించారు.
ఢిల్లీలోని ఆర్కే పురంలో ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ.. మధ్యతరగతి, నిజాయతీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. ‘శనివారం ప్రకటన తర్వాత భారత చరిత్రలోనే ఇది అత్యంత అనుకూలమైన బడ్జెట్ అని మధ్యతరగతి మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. ప్రతి కుటుంబం సంతోషిస్తోంది.. ’ అని మోదీ అన్నారు. అయితే, మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూపైనే మోదీ ఎప్పుడూ పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.