ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్రో 100వ మిషన్‌లో సాంకేతికలోపం.. మొరాయించిన ఎన్వీఎస్-02 శాటిలైట్

Technology |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 10:33 PM

గతవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన 100వ ప్రయోగంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉపగ్రహంలోని థ్రస్టర్లు (ఇంజిన్లు) ప్రజ్వరిల్లికపోవడమే ఇందుకు కారణమని ఇస్రో పేర్కొంది. జనవరి 29న జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ద్వారా రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాన్ని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే.


భారత ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 చాలా కీలకం. దీంతో ఎన్వీఎస్‌-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చేపట్టారు. ఇందుకోసం ఉపగ్రహం ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని మండించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆక్సిడైజర్‌ను ఇంజిన్లలోకి పంపే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు ప్రజ్వరిల్లలేదని ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది.


ప్రస్తుతం ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్ (భూఅనువర్తిత బదిలీ కక్ష్య -జీటీవో) లో పరిభ్రమిస్తోంది. నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు ఈ కక్ష్య అనువైంది కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఇస్రో పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఉపగ్రహం పనితీరులో ఎటువంటి లోపం లేదని, దాని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో వివరించింది.


ప్రయోగం చేపట్టిన రోజున ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జీటీఓలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ చేర్చిన తర్వాత.. దానిలోని సోలార్ ప్యానెల్స్ విజయవంతంగా అమర్చారు. వీటి ద్వారా ఉపగ్రహానికి అవసరమైన విద్యుత్‌ అందుతోంది. భూకేంద్రంతో ఉపగ్రహానికి కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకోగలిగామని ఇస్రో తెలిపింది. GSLV ద్వారా ఉపగ్రహాన్ని విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. రాకెట్ అన్ని దశలు సక్రమంగా పనిచేశాయి. ఉపగ్రహం అధిక స్థాయి ఖచ్చితత్వంతో కక్ష్యను చేరుకోగలిగింది. ఇస్రో ఛైర్మన్‌గా వి. నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే మొదటి మిషన్.


ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ.. నావిక్‌ మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో అధునాతమైంది. నాలుగేళ్ల కిందట ఇస్రో ప్రయోగించిన ఎన్వీఎస్ -01 మాదిరిగానే దీనిలోనూ ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లలో నావిగేషన్‌ పేలోడ్లు ఉన్నాయి. నావిక్‌ అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కచ్చితమైన నావిగేషన్ సమాచారం అందజేయనుందని ఇస్రో పేర్కొంది. కానీ, ప్రస్తుతం కక్ష్యలోకి చేర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com