ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 08:20 PM

చట్టబద్ధంగా మొదటి వివాహం రద్దుకాకముందే రెండో పెళ్లి చేసుకున్న మహిళకు భర్త విడాకులు ఇస్తే ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎన్‌.ఉషారాణి Vs మూడుదుల శ్రీనివాస్‌ కేసులో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉషారాణి అనే మహిళకు 1999లో నోముల శ్రీనివాస్‌ అనే వ్యక్తితో మొదట వివాహం జరిగింది. అనంతరం విబేధాలతో ఈ జంట 2005లో విడిపోయింది. పరస్పర అంగీకారంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత 2006లో ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. మూడుదుల శ్రీనివాస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. 2008లో వారికి ఓ బిడ్డ పుట్టింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో . శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులపై గృహహింస కేసు పెట్టింది. తన బిడ్డతో కలిసి రెండో భర్త ఇంటి నుంచి వచ్చేసిన ఆమె.. విడాకులు కోరింది. 2012లో మెయింటెనెన్స్‌ కోసం హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.


ఉషారాణి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆమె నెలకు రూ.3,500, బిడ్డకు రూ.5,000 భరణం చెల్లించాలని మూడుదుల శ్రీనివాస్‌ను ఆదేశించింది. అయితే, ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన అతడు.. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దుకానందున ఆమెకు తాను భరణం చెల్లించాల్సిన అవసరంలేదని వాదించారు. అతడి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. బిడ్డకు మాత్రమే భరణాన్ని ఖరారు చేసింది. ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అందుకు మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దుకాకపోవడమే కారణమని తెలిపింది.


హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఉషారాణి సుప్రీంకోర్టు గడపతొక్కారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అన్ని విషయాలను పరిశీలించి కుటుంబకోర్టు తీర్పును సమర్థించింది. ‘‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 125 కింద మెయింటెనెన్స్‌కు ఉన్న సామాజిక న్యాయం ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మహిళకు భరణాన్ని తిరస్కరించడానికి మా మనసు అంగీకరించ లేదు. ఆమె గురించి ముందే తెలిసిన ప్రతివాది.. పెళ్లి చేసుకొని విశేషాధికారాలు పొందాడు. బాధ్యతలకు వచ్చేసరికి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. రద్దైన రెండు వివాహాల నుంచి ఆమె మెయింటెనెన్స్‌ కోరి ఉంటే తప్పించుకోడానికి అవకాశం ఉండేది.. పోషణ ఆమెకు కల్పించే లబ్ధి కాదు.. చట్టబద్ధ నైతికహక్కు. ఫ్యామిలీ కోర్టు 2012లో ఆమెకు ప్రకటించిన మెయింటెనెన్స్‌ను పునరుద్ధరిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com