ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 మెడికల్ కళాశాలలకు నోటీసులు.. ఏపీలో 3, తెలంగాణలో ఒకటి

national |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 08:21 PM

నిబంధనలు పాటించని కాలేజీలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-యూజీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ర్యాగింగ్ కట్టడికి రూపొందించిన నిబంధనలను దేశంలోని 18 మెడికల్ కాలేజీలు పాటించడం లేదని గుర్తించింది. దీంతో ఆ 18 కాలేజీలకు తాజాగా షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ 18 వైద్య కళాశాలల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాలేజీలు 4 ఉండటం గమనార్హం. ఆ 4 కాలేజీల్లో ఒకటి తెలంగాణలో కాగా.. మరో మూడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవిగా యూజీసీ తెలిపింది. దేశంలోని అన్ని కాలేజీలు, విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ భూతాన్ని అరికట్టేందుకు యాంటీ ర్యాగింగ్‌ రెగ్యులేషన్స్‌- 2009 చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ చట్టం కింద.. సదరు కాలేజీలు నిబంధనలు అనుసరించడం లేదని.. సరిగా చర్యలు తీసుకోవడం లేదని భావించిన యూజీసీ తాజాగా నోటీసులు ఇచ్చింది.


ర్యాగింగ్‌ నిరోధక చర్యలు పాటించని దేశంలోని 18 వైద్య కళాశాలలకు తాజాగా యూజీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ 18 కాలేజీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ.. గుంటూరు మెడికల్ కాలేజీ.. కర్నూలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉన్నాయి.


ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా బిహార్‌ నుంచి మూడు కాలేజీలు ఈ నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి రెండు మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు అందాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఒక్కో కాలేజీ చొప్పున ఈ లిస్ట్‌లో ఉన్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్‌ను నిర్మూలించి.. స్టూడెంట్స్ ప్రశాంతంగా చదువుకునేందుకు.. యాంటీ ర్యాగింగ్‌ రెగ్యులేషన్స్‌ యాక్ట్- 2009ని తీసుకువచ్చారు. దీని ప్రకారం సూచించిన అంశాలను తప్పనిసరిగా అన్ని కాలేజీలు పాటించాల్సి ఉంటుంది.


అయితే ఈ 18 మెడికల్ కళాశాలలు మాత్రం ఈ నిబంధనలను పాటించడం లేదని యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషి పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల నుంచి యాంటీ ర్యాగింగ్‌ డిక్లరేషన్‌ను పొందడంలో విఫలమైనట్లు యూజీసీ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ షోకాజ్ నోటీసులు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోగా సరైన కారణాలను చెప్పాలని.. లోపాలను సరిదిద్దేందుకు తీసుకునే చర్యల్ని లిఖితపూర్వక వివరిస్తూ పూర్తి స్థాయిలో వివరణ పంపాలని ఆయా కాలేజీలను ఆదేశించినట్లు మనీష్ జోషి స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా సంతృప్తికరమైన సమాధానాలతో వివరణ ఇవ్వకపోతే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com