ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా లక్ష గుడ్లు దొంగతనం

international |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 10:59 PM

అమెరికాలో ప్రస్తుతం కోడి గుడ్ల కొరత నెలకొంది. కోడి గుడ్లను కొనుగోలు చేసేందుకు అమెరికన్లు భారీగా ఎగబడుతున్నారు. దీంతో కోడి గుడ్ల ధరలు అక్కడ అమాంతం పెరుగుతున్నాయి. అయితే ఉత్పత్తి తక్కువ కావడం.. డిమాండ్ పెరిగిపోవడంతో.. గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు.. బర్డ్ ఫ్లూ కారణంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గుడ్లు దొంగతనం జరగడం గమనార్హం. ఏకంగా 1 లక్ష గుడ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తాజాగా పోలీసులకు ఫిర్యాదు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరత నెలకొనగా.. ఇప్పుడు ఏకంగా లక్ష గుడ్లు దొంగతనానికి గురి కావడం సంచలనంగా మారింది.


పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్‌ నగరంలో ఉన్న పీట్‌ అండ్‌ గ్యారీస్‌ ఆర్గానిక్స్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థకు చెందిన లక్ష గుడ్లు మాయం అయ్యాయి. రిటైల్ షాపులకు సరఫరా చేసేందుకు గుడ్లను లారీల్లో లోడ్ చేయగా.. ఆ లోడ్ నుంచి దొంగలు కోడి గుడ్లను ఎత్తుకెళ్లినట్లు సదరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చోరీ అయిన గుడ్ల విలువ 40 వేల డాలర్లు అని.. అయితే ఇది మన భారత కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.


గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరతతో అమెరికావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్ల క్రితం డజన్ గుడ్లు ఒక డాలర్ అంటే మన కరెన్సీలో రూ.84 ఉండగా.. ఇప్పుడు అదే డజన్ గుడ్ల ధర ఏకంగా 7 డాలర్లు అంటే దాదాపు రూ.590 పలుకుతున్నట్లు చెబుతున్నారు. గుడ్ల కొరత కారణంగానే ఒక్కసారిగా వీటి ధర అమాంతం పెరిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికాలో గుడ్ల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బర్డ్‌ఫ్లూ కాగా.. మరొకటి పెరుగుతున్న గుడ్ల డిమాండ్. గత 2 ఏళ్లుగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో క్రమంగా బర్డ్‌ఫ్లూ ప్రభావం పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలోనే ఇంతటి భారీ స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


మరోవైపు.. గతనెలలో లూసియానా రాష్ట్రంలో మనుషులకు కూడా ఈ ప్రాణాంతకరమైన స్థాయిలో ఉండే బర్డ్‌ఫ్లూ వేరియంట్‌ను డాక్టర్లు కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు.. ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. 2022లో బర్డ్ ఫ్లూ కారణంగా 10.4 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లు చనిపోయాయని యునైటెడ్ ఎగ్ ప్రొడ్యూసర్స్ వెల్లడించింది. ఇవే కాకుండా గతేడాది అక్టోబర్‌లో 29 లక్షల కోళ్లు చనిపోయాయని.. ఈ కారణంగానే అమెరికాలో ప్రస్తుతం గుడ్ల కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినలేని అమెరికన్లు మొత్తం.. ఇప్పుడు గుడ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని.. అందుకే గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గుడ్ల ధరలు భారీగా పెరుగుతుండటంతో గుడ్లతో తయారు చేసే వంటకాల ధరలను కూడా రెస్టారెంట్లు, హోటళ్లు పెంచుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com