అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ వ్యక్తి బ్యాంకులో పెట్రోల్ క్యాన్లతో హల్చల్ చేశాడు. అనకాపల్లి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నర్సీపట్నం శాఖ ఉంది. రోలుగుంట మండలం జానకిరామపురంలో మంగళవారం ఉదయం.. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) సీఈవో బీవీవీవీఎస్ఆర్జీ రామకృష్ణ మరో వ్యక్తితో కలిసి బ్యాంకులోకి వచ్చాడు. తన వెంట మూడు క్యాన్లలో పెట్రోలుతో లోపలికి వెళ్లాడు.. గమనించిన సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. బ్యాంకులో సిబ్బందిని పక్కకు తోసేసి మరీ రామకృష్ణ ఓ పెట్రోలు క్యాన్తో మేనేజరు ఎల్కేఎన్ నాయుడు క్యాబిన్లోకి వెళ్లాడు. అక్కడ క్యాన్ మూత తీసి పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించాడు.
వెంటనే బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై రామకృష్ణ చేతిలో ఉన్న పెట్రోలు క్యాన్ లాక్కున్నారు.. అతడ్ని బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు బ్యాంకుకు చేరుకుని రామకృష్ణతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ ఎల్కేఎన్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో రామకృష్ణ, ఉద్యోగులు మడక దేవుడు, సాయి పథకం పెట్రోల్ తీసుకొచ్చి బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారుల్ని భయపెట్టారని.. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో సిబ్బంది, ఖాతాదారులు బయటకు వెళ్లకుండా తాళాలు వేసినట్లు తెలుస్తోంది.
తనకు జీతం ఇవ్వడంలేదని.. అందుకే ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ క్యాన్లతో బ్యాంకుకు వచ్చినట్టు రామకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది. జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో రామకృష్ణ రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.66 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయని.. ఆ డబ్బుల్ని సొంతానికి వాడేసుకున్నారని డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ అంటున్నారు. ఈ అంశంపై విచారణ పూర్తి చేసి చర్యలకు సిద్ధం కావడంతోనే రామకృష్ణ ఇలా చేశారన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa