ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎం కుమార్తెను సినిమాలో హీరోయిన్‌ను చేస్తామని మోసం చేసి

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 10:57 PM

సినిమాలో హీరోయిన్‌ను చేస్తామని చెప్పి.. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను రూ.4 కోట్లు తీసుకుని మొహం చాటేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేష్ పోఖ్రియాల్ కుమార్తె, నటి ఆరుషి నిశాంక్‌.. తనను ఇద్దరు ప్రొడ్యూసర్లు మోసం చేశారని వాపోయింది. ముంబైకి చెందిన ప్రొడ్యూసర్లు మానసి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా తన వద్ద నుంచి రూ. 4 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆరుషి నిశాంక్.. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు చేసింది. వారిపై రూ.4 కోట్ల చీటింగ్ కేసుతోపాటు మానసిక హింస, బెదిరింపులకు పాల్పడటం వంటి అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


ఆరుషి నిశాంక్ వద్దకు వచ్చిన ఆ ఇద్దరు నిర్మాతలు.. తమది ఎకా ఫిల్మ్స్ ప్రొడక్షన్ లిమిటెడ్ డైరెక్టర్ అని ఆమెను నమ్మించారు. తాము ‘ఆంఖో కి గుస్తాఖియాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాలో షానయ కపూర్, నటుడు విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఆ సినిమాలో మరో ప్రధాన నటి అవసరమని.. అందుకు మీరే కావాలని ఆరుషి నిశాంక్‌ను సదరు నిర్మాతలు నమ్మించారు. అయితే ఆ సినిమాలో తాను రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే.. ప్రధాన నటి పాత్రతోపాటు.. రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాల్లో 20 శాతం కూడా ఇస్తామని వారిద్దరూ తనకు చెప్పినట్లు ఆరుషి పోలీసులకు చెప్పింది.


ఒక వేళ.. సినిమాలో తనకు ఇచ్చిన పాత్ర నచ్చకపోయినా.. ఆ రోల్‌తో సంతృప్తి చెందకపోయినా.. తాను చెల్లించిన మొత్తం డబ్బును 15 శాతం వడ్డీతో తిరిగి ఇస్తామని వారిద్దరూ హామీ ఇచ్చినట్లు వివరించారు. అయితే సినిమా స్క్రిప్ట్ కూడా తనకు చెప్పలేదని వాపోయింది. ఇక తన డబ్బును తిరిగి అడిగినప్పుడు.. సినిమా షూటింగ్ భారత్‌లో పూర్తి అయిందని.. యూరప్‌లో షూటింగ్ జరుగుతుందని చెప్పినట్లు తెలిపింది. ఆరుషి నిశాంక్ ఫిర్యాదుతో ఆ ఇద్దరు నిర్మాతలపై మోసం, మానసిక వేధింపులు, బెదిరింపులు, నేరపూరిత కుట్ర, ఐటీ చట్టం కింద కొత్వాలి పోలీసులు కేసులు నమోదు చేశారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకుని తన రూ.4 కోట్లను తిరిగి తనకు అందించేలా చూడాలని పోలీసులకు ఆరుషి విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com