ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి వద్దంటు.. విడాకులు తీసుకుంటున్న జంటలు

international |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 10:58 PM

డ్రాగన్ కంట్రీలో వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోయింది. ఓవైపు వృద్ధుల జనాభా పెరగడం.. మరోవైపు.. యువత పెళ్లిళ్లు చేసుకోకపోవడంతో.. రానున్న భవిష్యత్‌లో దేశ భవిష్యత్ ఏంటో అని చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురి అవుతోంది. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనేవారికి భారీగా ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. అయినా చైనా యువత.. పెళ్లిళ్లు, సంతానం వైపు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ పెళ్లి అయిన జంటలు విడాకులు తీసుకుంటుండం పెరుగుతుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో గత కొన్నేళ్లుగా పెళ్లిళ్ల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తాజాగా విడుదలైన గణాంకాల ద్వారా తెలుస్తోంది. చైనాలో గత ఏడాది మొత్తం 61 లక్షల పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్ కాగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20 శాతం తగ్గినట్లు తాజాగా వెల్లడైంది. ఓవైపు పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోగా.. అలాంటి సమయంలోనే విడాకుల సంఖ్య పెరగడం ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేస్తోంది. దేశంలో జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్కడి యువత మాత్రం పెళ్లిళ్లు అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు.


 చైనా పౌరవ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. 2024లో చైనా వ్యాప్తంగా మొత్తం 61 లక్షల పెళ్లిళ్లకు సంబంధించి వివాహ రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. అయితే అంతకుముందు ఏడాది అంటే 2023 ఏడాదితో పోలిస్తే ఏకంగా 20.5 శాతం తగ్గడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 1986లో చైనాలో వివాహాల రిజిస్ట్రేషన్‌ మొదలుపెట్టగా.. అప్పటి నుంచి ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. 2013లో 1.3 కోట్ల వివాహాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య సగానికంటే తక్కువగా నమోదు కావడంతో చైనా ప్రభుత్వ అధికారుల్లో తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.


పెరుగుతోన్న విడాకులు..


అదే సమయంలో చైనాలో విడాకుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. 2024లో విడాకుల కోసం 26 లక్షల మంది భార్యాభర్తలు దరఖాస్తు చేసుకోగా.. ఈ సంఖ్య 2023 ఏడాదితో పోలిస్తే 28 వేలు అధికమని తెలుస్తోంది. విడాకులను తగ్గించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. పరిస్థితి మారడం లేదు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 30 రోజుల ‘కూలింగ్‌-ఆఫ్‌’ పీరియడ్‌ కచ్చితంగా పాటించాలని నిబంధన తీసుకువచ్చింది.


ప్రస్తుతం ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనాలో 2024లో శ్రామిక జనాభా (16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య) 68.3 లక్షలు తగ్గినట్లు తాజా రిపోర్ట్ వెలువరించింది. మొత్తం జనాభాలో 60 ఏళ్లకుపైగా వయసు కలిగిన వారు 22 శాతానికి పెరిగినట్లు తేలింది. అయితే దేశంలో జనాభా తగ్గడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడమేనని అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com