ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ బీచ్‌కు మహర్దశ.. తాజ్ గ్రూప్ ఎంట్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 07:30 PM

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి తేవాలనే ఆలోచనలతో పాటుగా పొడవైన తీర ప్రాంతాన్ని కూడా పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశంగా ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో పొడవైన తీరప్రాంతం ఉన్న మొదటి మూడు రాష్ట్రాలలో ఏపీ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆదాయ వనరుగా మార్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం, అధికారులు పలు సంస్థలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే పలు సంస్థలు కూడా పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.


ఈ క్రమంలోనే తాజ్ గ్రూప్ కాకినాడ తీరం వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. కాకినాడ బీచ్ సమీపంలో పర్యాటక ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో తాజ్‌గ్రూప్ ఉన్నట్లు సమాచారం. తాజ్ గ్రూప్ ప్రతినిధులు కూడా ఇటీవల కాకినాడ బీచ్ సందర్శించి వెళ్లారు. ఎన్టీఆర్ బీచ్‌తో పాటు సమీప తీర ప్రాంతాన్ని తాజ్ గ్రూప్ ప్రతినిధులు సందర్శించారు. అలాగే కాకినాడ బీచ్‌కు సమీపంలో పర్యాటక ప్రాజెక్టు కోసం 30 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ఆ మేరకు భూమిని అందించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని కోరినట్లు సమాచారం. అయితే ఇక్కడే ఓ సమస్య ఎదురైంది. కాకినాడ తీరంలో ఖాళీ భూములు అందుబాటులో లేవు. తాజ్ గ్రూపు అడిగిన ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు ఎకరాలు తప్ప.. ఎక్కువ భూమిని పర్యాటకానికి కేటాయించే అవకాశాలు లేవు. దీంతో తాజ్ గ్రూప్ ప్రాజెక్టుపై సంధిగ్ధత కొనసాగుతోంది.


మరోవైపు కాకినాడ తీరానికి బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా దక్కితే.. మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అయితే కాకినాడ తీరానికి బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా దక్కాలంటే శుభ్రత, సౌకర్యాలను కూడా మెరుగుపరచాల్సి ఉంది. కానీ కాకినాడ తీరంలో పరిశుభ్రత లేదని స్వయానా పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఇటీవల చెప్పారు. జనవరిలో కాకినాడ తీరాన్ని సందర్శించిన అజయ్ జైన్.. కాకినాడ బీచ్‌ బ్రహ్మాండంగా ఉందనీ.. కానీ అక్కడంతా గలీజుగా ఉందని అన్నారు. కాకినాడ బీచ్‌ నిర్వహణను కార్పొరేట్ సంస్థకు ఇచ్చి, సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారని వెల్లడించారు.


మరోవైపు కాకినాడ బీచ్‌ వద్ద సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇటీవలే స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు పర్యటించారు. సీప్లేన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు పరిశీలించారు. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చి.. తాజ్ గ్రూప్‌కు అనువైన స్థలాన్ని ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమకూర్చగలిగితే కాకినాడ తీరానికి మహర్దశ వచ్చినట్లేనని ఆ ప్రాంతవాసులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com