ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఈ వైరస్ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో మూడు రోజుల్లో 11 వేల కోళ్లు మృతి చెందాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వెటర్నరీ వైద్యులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్నాయుడు చెప్పారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని అన్నారు. పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు.