ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 05:11 PM

ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొంది. ఉచితంగా రేషన్, డబ్బులు ఇస్తుంటే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించారు.పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. "దురదృష్టవశాత్తూ.. ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. వాళ్లకు ఉచితంగా రేషన్ అందుతోంది. ఏ పనిచేయకుండా డబ్బులు వస్తున్నాయి'' అని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశం మంచిదేనని, అయితే వారిని సమాజ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని పేర్కొంది.దీనిపై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానమిస్తూ, పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే దశలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి యోచిస్తోందని చెప్పారు. దీంతో ధర్మాసనం తిరిగి స్పందిస్తూ పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఎంత కాలం పనిచేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆరు వారాల తర్వాత తిరిగి విచారణ జరుపుతామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com