రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నియామకాలు, తొలగింపులు చూసుకునేందుకు.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ-డోజ్ను ట్రంప్ ఏర్పాటు చేశారు. ఈ డోజ్ బాధ్యతలను ప్రపంచ అపర కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన డోజ్.. అధికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. మరోవైపు.. తాజాగా ఎలాన్ మస్క్కు మరిన్ని అధికారులు ట్రంప్ కట్టబెట్టడంతో అమెరికాలో భారీగా ఉద్యోగాల కోతలు ఉంటాయని అమెరికన్ల భయపడిపోతున్నారు.
తాజాగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్కు మరిన్ని అధికారాలు కల్పించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే ట్రంప్ సంతకం చేసే సమయంలో ఓవల్ ఆఫీస్లో ఎలాన్ మస్క్ తన నాలుగేళ్ల కుమారుడు X Æ A-Xii తో కలిసి ఉండడం గమనార్హం. ఈ నిర్ణయంతో అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల కోతలు ఉండనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక నుంచి అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు.. డోజ్ను సంప్రదించిన తర్వాతే ఉద్యోగులను నియమించుకోవడం, తొలగించడం చేయాలని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ట్రంప్ వెల్లడించారు. ప్రతీ ఫెడరల్ ఏజెన్సీ తక్కువ ఉద్యోగులతో పనిచేయాలని.. అవసరమైన మేరకు మాత్రమే కొత్త ఉద్యోగులను తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డోజ్ పనితీరును డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇక డోజ్ తీసుకుంటున్న నిర్ణయాలపై దావాలు నమోదు అవుతున్నా.. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని మస్క్కు సూచించారు. అమెరికా ప్రభుత్వంలో భారీ సంస్కరణలు తీసుకువచ్చేందుకే రిపబ్లికన్ పార్టీని అమెరికన్లు ఓటు వేసి గెలిపించారని ఎలాన్ మస్క్ తెలిపారు. అందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ప్రజాస్వామ్యం అంటే ఇదే అని పేర్కొన్నారు. పారదర్శకంగా పనిచేసేందుకు డోజ్ ఎల్లపుప్డూ ప్రయత్నిస్తుందని వివరించారు. వృథా ఖర్చులు, అనవసర ఉద్యోగులను తగ్గించకపోతే అమెరికా దివాలా తీస్తుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa