దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలు దక్కించుకుని భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 8వ తేదీనే ఫలితాలు వెల్లడి కాగా.. ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చలేదు బీజేపీ. కానీ మరో నాలుగైదు రోజుల్లోనే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తేదీ లేదా 20వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారట. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 8వ తేదీన ఫలితాలను వెల్లడించారు. ముఖ్యంగా 70 స్థానాలకు గాను 48 స్థానాలకు బీజేపీ గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే అంకితం అయింది. ఈక్రమంలోనే కాషాయ దళం హస్తినలో డబుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎన్నికలు ఫలితాలు విడుదల అయి రోజులు గడుస్తున్నా బీజేపీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించలేదు. కానీ ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 19వ తేదీన లేదంటే 20వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కాషాయ దళం 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసిందట. వీరిలో 9 మందిని షార్ట్ లిస్ట్ చేసి.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్ పదవులను కేటాయించబోతున్నారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే ఆయన తిరుగు ప్రయాణం కాగా.. ఈరోజు రాత్రి వరకు ఇండియా చేరుకుంటారు.
మోదీ వచ్చిన వెంటనే అంటే సోమవారం లేదా మంగళ వారం రోజు బీజేపీ నేతలంతా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొంత మంది అగ్రనేతలు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చబోతున్నారు. అయితే సీఎం రేసులో ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్, సతీష్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూదర్, పవన్ వర్మ వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే పూర్వాంచల్ నేపథ్యం కల్గిన ఎమ్మెల్యేను లేదంటే సిక్కు మహిళను ముఖ్యమంత్రిని చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa