కారు ప్రమాదానికి గురైన టీమీండియా క్రికెటర్ రిషబ్ పంత్ను కాపాడిన ఉత్తర్ ప్రదేశ్కు చెందిన యువకుడు రజత్ కుమార్ (25).. తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫిబ్రవరి 9న ముజఫర్నగర్ జిల్లాలోని బుచ్చా బస్తీ గ్రామంలో రాజ్కుమార్, ఆమె ప్రియురాలు మను కశ్యప్ విషం తాగినట్టు పోలీసులు తెలిపారు. ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిర్మానుష ప్రాంతంలో విషం సేవించిన ఇద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతండగా... అటుగా వెళ్తున్నవారు గమనించారు. వెంటనే వారికి ఆసుపత్రికి తరలించగా.. మను చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రస్తుతం కుమార్ పరిస్థితి విషమంగా ఉందని, మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను నిరాకరించిన పెద్దలు.. ఇరువురికీ వేరే వ్యక్తులతో పెళ్లి సంబంధాలు ఖాయం చేశారు. ఈ పెళ్లిళ్లు ఇష్టం లేని కుమార్, మనులు.. కలిసి ఎలాగూ బతకలేమని, కనీసం మరణంలోనైనా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పిబ్రవరి 9న ఇరువురూ కలిసి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో మను మృతిచెందగా... రాజ్ కుమార్ చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. తన కుమార్తెను అతడు కిడ్నాప్ చేసి.. విషం తాగించాడని మను కశ్యప్ తల్లి ఆరోపించారు. కాగా, రజిత్, మనులూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.
డిసెంబరు 30, 2022లో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని తన సొంతూరు డెహ్రాడూన్కు పంత్ కారులో వెళ్తుండగా రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో పంత్ను రాజ్కుమార్.. నిషు కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు రక్షించారు. ప్రమాద స్థలికి సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇరువురూ కారు పల్టీలు కొట్టడం గమనించి పరుగున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కారుకు మంటలు అంటుకోగా.. అందులో నుంచి పంత్ను బయటకు లాగి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పంత్ ప్రాణాలు కాపాడటానికి వారు చేసిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇక, పంత్ సైతం తన ప్రాణాలు కాపాడిన వారికి కృతజ్ఞతగా స్కూటర్లను బహుమతి ఇచ్చారు.
![]() |
![]() |