గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందనివైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లు వెనుకుండి నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రావారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. సాంకేతికంగా చూస్తే హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్ను విచారించలేదని పేర్కొన్నారు. టీడీపీ కక్షసాధింపులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్రెడ్డి హెచ్చరించారు. ఈ తతంగమంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగానే పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అధికారులుగా ఎవరుండాలి, దర్యాప్తు చేసి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరెవర్ని సాక్ష్యులుగా తీసుకోవాలి, ఎవర్ని కేసుల్లో ఇరికించాలి, ఇలాంటివన్నీ కూటమి నాయకులే చెప్పడం దానిని పోలీసులు తుచ తప్పకుండా అమలు పరచడం కనిపిస్తోంది. ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పోలీసులకు ఇదే పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతి పరులను అక్రమ కేసులతో వేధించి జైలు పాలు చేయడం, వైయస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేస్తున్నారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa