బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై అధ్యయనం చేసి. కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలను రూపొందించాలని కమిటీ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఈ ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ ఏడుగురు సభ్యుల కమిటీలో రాష్ట్ర డీజీపీతోపాటు స్త్రీ శిశు సంక్షేమం,మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శిలను సభ్యులుగా నిర్ణయించింది.
మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడుగురు సభ్యుల కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడి ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చేసిన చట్టపరమైన అంశాలు, చట్టాలను కూడా ఈ కమిటీ పరిశీలించనుందని వెల్లడించారు. ఇలాంటి లవ్ జిహాద్, మత మార్పిడిని అడ్డుకునేందుకు రూపొందించే అంశాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ తెలియజేస్తుందని చెప్పారు. అయితే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి ప్రభుత్వం.. గతేదాడి కూడా ఈ లవ్ జిహాద్ అంశాన్ని ప్రస్తావించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మహారాష్ట్ర మంత్రి మంగళ్ లోధా.. దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంఘటనలు గత కొంత కాలంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న శ్రద్ధా వాకర్ను ఆమె ప్రియుడు ఎలా ముక్కలు చేశారో దేశం మొత్తం చూసిందని గుర్తు చేశారు. ఇక దేశంలోనే కాకుండా.. మహారాష్ట్రలో కూడా ఇలాంటి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. తమ ప్రభుత్వం లవ్ జిహాద్ను ఆపడానికి ప్రయత్నిస్తోందని తెలిపిన మంత్రి మంగళ్ లోధా.. అమ్మాయిలకు న్యాయం జరగాలని నొక్కి చెప్పారు. ఇందుకోసం ఒక కమిటీ ఏర్పడటం మంచిదని.. ఈ కమిటీ నివేదిక కూడా త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఏడుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa