దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని నెలలుగా శీష్మహల్ వివాదం చెలరేగుతోంది. ఈ శీష్మహల్ విషయంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం చెలరేగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన శీష్మహల్ను.. గతంలో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ పునరుద్ధరించింది. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్న సమయంలో.. ఈ శీష్మహల్ పునరుద్ధరణ పనులు జరిగాయి. అయితే ఇందులో ఆప్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని.. ఢిల్లీ బీజేపీతోపాటు ఆ పార్టీ హైకమాండ్ కూడా కేజ్రీవాల్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయి.. బీజేపీ అధికారంలోకి రాగా.. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా శీష్మహల్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రజా పనుల విభాగం నివేదిక సమర్పించిన తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ శీష్మహల్పై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఢిల్లీలోని 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో ఉన్న ఈ శీష్మహల్.. 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. ఈ శీష్మహల్ బంగ్లా ఆధునీకరణ కోసం అప్పటి కేజ్రీవాల్ సర్కార్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ పని చేసిన సమయంలో. సివిల్ లైన్స్లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉండేది. అయితే ఆ నివాసాన్నే గత కొన్ని నెలలుగా.. బీజేపీ శీష్మహల్గా పిలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు కాషాయ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ బంగ్లా పునరుద్ధరణ పనుల్లో భారీ కుంభకోణం జరిగిందని అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కేంద్రం విచారణకు ఆదేశించడం గమనార్హం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలై.. బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 70 సీట్లకు గానూ ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి.. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఇక 12 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వంటి కీలక ఆప్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఆప్ కీలక నేతల్లో మాజీ సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందడం ఆ పార్టీకి కాస్త ఊరటలా మారింది. ఈనెల 19 లేదా 20వ తేదీల్లో ఢిల్లీకి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే బీజేపీ సీఎం ఈ శీష్మహల్కు దూరంగా ఉంటారని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa