ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ-ట్రంప్ సంయుక్త ప్రకటన.. పాకిస్తాన్ సంచలన ఆరోపణలు

international |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 10:06 PM

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై అనేక విషయాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదంపై భారత్-అమెరికాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనలో పాకిస్తాన్‌కు కీలక సూచనలు చేశారు. అయితే ట్రంప్-మోదీ సంయుక్త ప్రకటనపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటన పూర్తిగా ఏకపక్షంగా ఉందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌-అమెరికాలు చేసిన ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాకిస్తాన్.. తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ మరో ప్రకటన విడుదల చేసింది.


భారత్-అమెరికా ప్రకటనపై ఇస్లామాబాద్‌లోని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ట్రంప్-మోదీ చేసిన సంయుక్త ప్రకటనలో భారత్‌ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ప్రకటన పూర్తిగా ఏకపక్షమని.. తప్పుదోవ పట్టించేదిగా ఉందని నిరసన వ్యక్తం చేసింది. ఇది దౌత్య నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. పాకిస్తాన్ త్యాగాలను పరిగణలోకి తీసుకోకుండానే ప్రకటన విడుదల చేశారని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు భారత ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం దాచిపెట్టలేవని పాక్‌ ప్రతినిధి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక భారత్‌ అమెరికా మధ్య జరిగిన ఒప్పందాలపైనా పాక్ స్పందించింది. రక్షణపరంగా భారత్‌కు టెక్నాలజీని, ఆయుధాల సరఫరాను అమెరికా చేయడంపైనా పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రాంతీయ సమతుల్యతలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని పాక్ తెలిపింది. భారత్‌కు ఎఫ్‌-35 విమానాలు సహా పలు ఆయుధాలు విక్రయించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తాజా భేటీలో మోదీకి ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.


మరోవైపు.. ట్రంప్-మోదీ భేటీలో ముంబై దాడులకు కుట్ర చేసిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ఆమోదం కల్పించారు. తహవూర్‌ రాణా అప్పగింతకు అమెరికా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యక్తుల్లో తహవూర్ రాణా కూడా ఒకడని పేర్కొన్నారు. అతడు భారత్‌లో చేసిన నేరాలకు తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలని వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa