ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క అక్షరం మార్చి మేఘా కంపెనీకి .. రూ.5.47 కోట్లు కొట్టేసిన కేటుగాడు

Crime |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 10:09 PM

మోసాలందు ఈ మోసం వేరయా..! అన్నట్లుగా దేశంలోనే టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఓ కేటుగాడు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ మెయిల్‌లో ఒకే ఒక్క అక్షరం మార్చి కోట్లు కోట్టేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 5.47 కోట్లు స్వాహా చేశాడు. ఆలస్యంగా అసలు విషయం తెలిసి ఖంగుతున్న కంపెనీ ప్రతినిధులు.. పోలీసులను ఆశ్రయించారు. బాలానగర్‌లోని సంస్థ ఎకౌంట్స్‌ మేనేజర్‌ దుంపల శ్రీహరి TGCSBకి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మే 10న మేఘా కంపెనీ తమ సంస్థకు అవసరమైన సామగ్రి కోసం నెదర్లాండ్స్‌లోని ఓ సంస్థతో లావాదేవీలు జరిపింది. ఆ దేశ కరెన్సీలో మెుత్తం 14.39 లక్షల యూరోల విలువైన కొనుగోలుకు ఈ మెయిల్ ద్వారా ఆర్డర్‌ ఇచ్చింది.


అదే నెల 17న 7.95 లక్షల యూరోల విలువైన మరో ఆర్డర్‌ను కూడా ఇచ్చింది. అనంతరం ఒప్పందం ప్రకారంగా మేఘా కంపెనీ ప్రతినిధులు.. ఆ సంస్థకు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తూ పోయారు. అలా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన ప్రతిసారి ఆ సంస్థ ప్రతినిధి నుంచి మేఘా కంపెనీకి కన్ఫర్మేషన్‌ మెయిల్‌ వచ్చేది. ఈక్రమంలోనే గతేడాది నవంబరు 29న నెదర్లాండ్స్‌ సంస్థ పేరిట మేఘా కంపెనీకి ఒక మెయిల్‌ వచ్చింది. కోర్టు కేసుల కారణంగా తమ బ్యాంకు పాత అకౌంట్‌పై ఆంక్షలున్నాయని ఆ మెయిల్ సారాంశం. ఇక నుంచి కొత్త బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు పంపాలని పేర్కొన్నారు. ఇక్కడే సైబర్‌ కేటుగాళ్లు తమ తెలివిని ప్రదర్శించారు. ఒకే ఒక్క అక్షరం తేడాతో ఆ సంస్థ మెయిల్‌ను పోలి ఉన్న మరో ఫేక్ మెయిల్‌ను మేఘా సంస్థకు పంపారు. అందులో తమ బ్యాంకు అకౌంట్ వివరాలు ఇచ్చారు.


దీంతో ఈ ఏడాది జనవరి 24న మేఘా కంపెనీ ప్రతినిధులు.. రాజ్‌భవన్‌ బ్రాంచ్‌ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి 3.18 లక్షల యూరోల డబ్బును సైబర్ కేటుగాళ్ల ఫేక్ బ్యాంకు అకౌంట్‌కు పంపించారు. అదే నెల 27న సైబర్ కేటుగాళ్ల నుంచి కన్ఫర్మేషన్‌ మెయిల్‌ సైతం వచ్చింది. దీంతో జనవరి 29న మరో 2.89 లక్షల యూరోలను సైతం బదిలీ చేశారు. అయితే డబ్బులు ఇంకా అందలేదని.. నెదర్లాండ్స్‌ సంస్థ నుంచి మెయిల్‌ రావడంతో మేఘా కంపెనీ ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. మెయిల్ ఖాతాలను చెక్ చేసి.. ఫేక్‌గా గుర్తించారు. నకిలీ మెయిల్‌ పంపించి సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారని గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సైబర్ కేటుగాళ్లు కొట్టేసిన మెుత్తం సొమ్ము ఇండియన్ కరెన్సీలో రూ.5.47 కోట్లని టీజీసీఎస్‌బీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa