ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాపై పాకిస్తాన్ గరంగరం

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 10:35 PM

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్‌లో హై ఓల్టేజ్ కరెంట్ పాసవుతూ ఉంటుంది. మ్యాచ్ ముగిసేవరకూ అభిమానుల్లో ఉత్కంఠే. దాయాదుల పోరులో ఆఖరి వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మ్యాచ్ ఇంకా రసవత్తరంగా జరగడం ఖాయం అనిపిస్తోంది.


ఐసీసీ వేదికలపై భారత్-పాక్ ఆటగాళ్లు కలిసినప్పుడల్లా చాలా ఫ్రెండ్లీగానే ఉంటూ వస్తున్నారు. గతంలో ఇరు దేశాల ఆటగాళ్లు గ్రౌండ్‌లోనే గొడవలకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. గంభీర్-అఫ్రిది, హర్భజన్-అక్తర్ గ్రౌండ్‌లో ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు కూడా. విరాట్ కోహ్లి కెప్టెన్ అయిన తర్వాత నుంచి భారత్-పాక్ మ్యాచ్‌లు చాలా ఫ్రెండ్లీగా సాగడం మొదలయ్యాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు హగ్‌లు ఇచ్చుకుంటూ, బ్యాట్‌లు కూడా మార్చుకునేవారు. ఇది చాలా మంచి పరిణామం కూడా.


 ఇప్పుడు అలా కాదు


పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి తాము రామంటూ బీసీసీఐ తెగేసి చెప్పడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య హీటు మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడాలంటే దుబాయ్ వేదికగా తమకు మ్యాచ్‌లు జరగాలంటూ భీష్మించుకు కూర్చోవడంతో ఐసీసీ ఒత్తిడి మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తగ్గక తప్పలేదు. దాంతో భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.


ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు ఒక రకంగా వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. తమ దేశానికి రాని భారత క్రికెట్ల ప్లేయర్లతో పాకిస్తాన్ ఆటగాళ్లు అంత చనువుగా ఉండొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లికి హగ్‌లు ఇవ్వొద్దని చెబుతున్నారు. పాకిస్తాన్ జట్టులో ఆ పట్టుదల ఉండాలని సూచిస్తున్నారు.


ఇదే విషయమై పాక్ మాజీ క్రికెటర్లు కూడా పలుమార్లు పెదవి విరిచారు. గేమ్‌లో ఫ్రెండ్లీగా ఉంటే ఆ పోటీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఏకంగా తమ జట్టు ప్లేయర్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరిపై ఎలా శతృత్వం లేదని, కానీ ఆట జరిగే సమయంలో అలా క్లోజ్‌గా ఉండొద్దని గట్టిగా చెప్పాడు. కోహ్లి రాగానే షేక్ హ్యాండ్‌లు ఇవ్వడం, నవ్వుతూ మాట్లాడటం లాంటివి చేయొద్దని హెచ్చరించాడు.


ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరి 23న జరిగే భారత్-పాక్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరుగుతుందో ఊహించుకోవచ్చు. పైగా ఆతిథ్య జట్టయిన పాకిస్తాన్‌ను దుబాయ్ రప్పించుకుని మరీ భారత్ ఆడుతోంది. మహమ్మద్ రిజ్వాన్ నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ జట్టుకు ఈపాటికే పీసీబీ, మాజీ కెప్టెన్ల నుంచే కాకుండా డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి కూడా ఆదేశాలు అందుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa