ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీబీఎస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి,,ఏపీలో తొలి మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 07:45 PM

గులియన్ బారే సిండ్రోమ్‌ కారణంగా ఏపీలో తొలి మరణం సంభవించింది. జీబీఎస్‌తో బాధపడుతున్న ఓ మహిళ గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలు ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళగా తెలిసింది. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ కాళ్లు చచ్చిబడిపోయి సదరు మహిళ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. అటు తెలంగాణలోనూ జీబీఎస్ కారణంగా ఇప్పటికే ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది.


ఇప్పుడు ఏపీలోనూ జీబీఎస్ తొలి మరణం సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ ఇటీవల వెల్లడించింది. గుంటూరు జిల్లాలోనే నాలుగు కేసులు నమోదయ్యాయి. మరోవైపు జీబీఎస్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని.. చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్తోంది.


అసలేంటీ జీబీఎస్ వ్యాధి?


గులియన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. చాలా అరుదుగా లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే వస్తుంటుందని వైద్యులు చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరుతో పాటుగా ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కాకినాడ జిల్లాలలో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. జీబీఎస్ ఒక రకంగా పక్షవాతం లాంటిదేనని.. ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుందని చెప్తున్నారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడిపోతాయని.. లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని చెప్తున్నారు.


జీబీఎస్ వ్యాధి లక్షణాలు


వేళ్లు, మడమలు, మణికట్టు వంటి ప్రాంతాలతో సూదులతో పొడిచినట్లు అనిపించడంతో పాటుగా కాళ్లనొప్పులు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అలాగే కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరిస్తూ ఉంటుందని.. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతుంటాయని చెప్తున్నారు. సరిగ్గా నడవలేకపోవటం, తూలటం జరుగుతూ ఉంటుందంటున్నారు. ఏదైనా నమలడం, మాట్లాడటంలో ఇబ్బందిగా ఉండటంతో పాటుగా నోరు వంకరపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. జీబీఎస్ వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని.. రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని సూచిస్తున్నారు.


కాచి చల్లార్చిన నీటినే తాగాలని, మాంసాన్ని బాగా ఉడికించాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కూరగాయలు, పండ్లను ఒకటికి రెండుసార్లు నీటితో శుభ్రపరిచిన తర్వాతనే తినాలంటున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటుగా వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa