గుంటూరు జిల్లాలో కొందరు దుండగులు సినిమా రేంజ్లో భారీ చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు నగలతో కూడిన బ్యాగుతో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించారు. బైక్పై వచ్చిన దుండగులు.. ఆ వ్యక్తిని అడ్డుకుని బెదిరించారు. అనంతరం అతడి వద్ద ఉన్న బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ వ్యక్తి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న బంగారు నగల బ్యాగును కొందరు ఎత్తుకుపోయారని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తం గాలింపు చేపట్టారు.
మంగళగిరి మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ భారీ చోరీ చోటు చేసుకుంది. దాదాపుగా 5 కిలోల బంగారు నగలు అపహరణకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ డీవీఆర్ జ్యువెలరీ షాప్ యజమాని రాము విజయవాడ నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి శనివారం రాత్రి బయల్దేరాడు. అయితే మంగళగిరి మండలం ఆత్మకూరు అండర్ పాస్ వద్దకు రాగానే ఈ చోరీ జరిగింది. అంతకుముందు నుంచే రామును బైక్పై ఫాలో అయిన ఇద్దరు దుండగులు.. అతడిని బెదిరించారు.
చంపేస్తామని బెదిరించిన ఆ దుండగులు.. రాము వద్ద ఉన్న బంగారు ఆభరణాల బ్యాగును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భయంతో వణికిపోయిన రాము.. హుటాహుటిన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన దొంగతనం గురించి వివరించి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి.. ఆ బంగారం దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
చోరీ జరిగిన ఆత్మకూర్ అండర్ పాస్ పరిసర ప్రాంతాలను ముమ్మరంగా గాలించారు. అయినా దొంగల జాడ తెలియకపోవడంతో కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే తన వద్ద ఉన్న బ్యాగులో 4.900 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. డీవీఆర్ జ్యువెలరీ షాప్ ఓనర్ రాము ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.4 కోట్లకుపైనే ఉంటుందని పోలీసులకు వివరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa