డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఛేజ్ చేసి.. గుజరాయ్ జెయింట్స్పై విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో చివరి బంతికి గెలుపుగీతను దాటింది. హైదరాబాద్కు చెందిన అరుంధతి రెడ్డి.. చివరి బంతికి రెండు పరుగులు చేసి.. జట్టుకు విజయాన్ని అందించింది.
వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42 రన్స్) మెరుపులతో 10.4 ఓవర్లలో 105/2తో నిలిచింది. 200 పైచిలుకు స్కోరు నమోదు చేసేలా కనిపించింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుస ఓవర్లలో ముంబై బ్యాటర్లను పెవిలియన్కు పంపించారు. ఓ పక్క నాట్ సీవర్ బ్రంట్ నిలబడ్డా.. ఆమెకు సహకరించేవారు లేకుండా పోయారు. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2, క్యాప్సీ 1, మిన్ను మని 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం.. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్ షఫాలీ వర్మ పవర్ హిట్టింగ్తో అదరగొట్టింది. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే ముగిసే సరికి 60/0తో నిలిచింది. 18 బంతుల్లో 43 రన్స్ చేశాక షఫాలీ ఔట్ కావడంతో.. ఢిల్లీ స్కోరు నెమ్మదించింది. ఈ దశలో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించింది.
కానీ ఇటీవల భారత మహిళల జట్టుకు అండర్ 19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35 రన్స్), సారా సారా బ్రైస్ (10 బంతుల్లో 21 రన్స్) పోరాడారు. దీంతో ఢిల్లీ పోటీలోకి వచ్చింది. ఇక ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. దీంతో సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారింది. ఈ దశలో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి.
ఈ దశలో రాధా యాదవ్ సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో ఢిల్లీకి 10 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ తొలి బంతికే నికీ ప్రసాద్ ఫోర్ కొట్టింది. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు రావడంతో సమీకరణం 4 బంతుల్లో 4 రన్స్గా మారింది. అయితే ఆ తర్వాత రెండు బంతులకు సింగిల్స్ రాగా.. ఆ ఓవర్ ఐదు బంతికి నికీ ప్రసాద్ ఔట్ అయింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హైదరాబాద్కు చెందిన అరుంధతి రెడ్డి షాట్ కొట్టి రెండు పరుగులు తీయాలని ప్రయత్నించింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా… వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్కు నివేదించగా... రీప్లేలో ఆమె కొద్ది క్షణాల వ్యవధిలో క్రీజు దాటినట్లు తేలింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa