ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైళ్ల పేర్లలో గందరగోళమే ,,,,ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసిలాటకు కారణమా

national |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 10:27 PM

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనకు కారణాలు ఏంటనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. శనివారం రాత్రి న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాటకు కారణాలు ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా రైళ్ల పేర్లలో గందరగోళమే తొక్కిసలాటకు కారణమని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ స్పెషల్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ పేర్ల మధ్య గందరగోళమే ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమని ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్తున్నాయి.


ప్రయాగ్‌రాజ్ వెళ్లే రెండు రైళ్లకు ఒకేలా పేర్లు ఉండటంతోనే ప్రయాణికులు తికమకపడ్డారని.. తమ రైలు వెళ్లిపోతుందనే ఆందోళనే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్తున్న ప్రకారం.. శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌ స్పెషల్‌ రైలు తొలుత ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 16 మీదకు వస్తోందంటూ మైకులో ప్రకటించారు. అయితే ఆ సమయానికే ప్లాట్ ఫామ్ 14పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఓ రైలు ఆగి ఉంది. అయితే అప్పటికే ప్లాట్‌ఫామ్ 14 మీద ఉన్న రైలు ప్రయాణికులు.. రైల్వే సిబ్బంది ప్రకటన వినగానే తమ రైలు 16వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ మీదకు వస్తోందని కంగారు పడ్డారు. వెంటనే వెళ్లకపోతే రైలు తప్పిపోతుందనే భయం, ఆందోళనతో వందల మంది ప్రయాణికులు 16వ నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు పరుగులు తీశారు.


అయితే అప్పటికే 12,13, 14 ప్లాట్‌ఫామ్‌లపై భారీగా ప్రయాణికులు ఉండటం, 14వ ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవారు 16వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకెళ్లటంతో.. ఈ హడావిడిలో తొక్కిసలాట జరిగిందని ఢిల్లీ పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది.


 అలాగే ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై ఇద్దరు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్లోని అన్ని వీడియో ఫుటేజీలను భద్రపరచాలని ఆదేశించారు. ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు స్పెషల్ మహాకుంభ్ ట్రైన్లు నడపనున్నట్లు నార్తర్న్ రైల్వే ప్రకటించింది. అటు ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్లలలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa