ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 03:29 PM

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. చికెన్ కొనడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. దీంతో పట్టణంలో చాలా వరకు చికెన్ షాపులు మూతపడ్డాయి.అలాగే కోడిగుడ్లు తినాలన్నా వెనకడుగు వేస్తున్నారు. దీంతో జిల్లాలో చికెన్, కోడిగుడ్డు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో కిలో రూ.230 పలికిన చికెన్ నేడు కిలో రూ.160కు పడిపోయింది. అలాగే ఒక్కో గుడ్డు రూ.7.50 పలికిన ధర నేడు రూ.5.23కు తగ్గిపోయింది. చిత్తూరు నుంచి ఇతర రాష్ట్రాలకు కోళ్లు, కోడి గుడ్ల ఎగుమతి చాలా వరకు తగ్గిపోయింది.ఇప్పటివరకు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించక పోయినా, ఉభయ గోదావరి జిల్లాల ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా మీద భారీగానే పడింది. వ్యాపారం పడిపోవడంతో కోళ్ల ఫారం యజమానులు ఆందోళన చెందుతున్నారు. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడాన్ని ఇష్టపడుతారు. బంధువులు, మిత్రులు వచ్చినా, ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకోవాలన్నా, ఆదివారం నాడు ఇంట్లో కోడికూర ఉడికాల్సిందే. బర్డ్ ఫ్లూ తో చికెన్ తింటే ఏమవుతుందో అన్న భయం వ్యక్తం అవుతోంది. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి.అత్యధిక సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా పడిపోతుండడంతో పౌల్ట్రీ రైతుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. వైరస్ గుర్తించి వెంటనే నిరోధక చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రభాకర్ మాట్లాడుతూ.. "బర్డ్ ఫ్లూ వైరస్ గోదావరి జిల్లాలలోని కోళ్ళలో మాత్రమే ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాధి లేదు" అని తెలిపారు. కోళ్ళకు వ్యాధి నిరోధక చర్యలను చేపట్టి జాగ్రత్తలు తీసు కొంటున్నాం. కోడి మాంసం, గుడ్లు వినియోగించే వారు గుడ్లు, మాంసం బాగా ఉడికించి తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa