ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. కుంభమేళా చివరి దశకు చేరుకున్నా.. భక్తుల రద్దీ మాత్రం అస్సలే తగ్గట్లేదు. మరో వారం రోజుల్లోనే ఇది ముగియనుండగా.. దేశ ప్రజలతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం పుణ్య స్నానాలు చేయాలని చూస్తున్నారు. ఈక్రమలోనే యూపీ సర్కారు తమ రాష్ట్రంలోని ప్రజలంతా కుంభమేళాలో పాల్గొనేలా జాగ్రత్తలు చేపట్టింది. బయట ఉన్న వాళ్లు సులువుగా ఆ కార్యక్రమానికి వస్తుండగా.. జైల్లలో ఉన్న ఖైదీలు కూడా అక్కడకు రావాలని చూస్తున్నారట.
అయితే ఈ విషయాన్ని గుర్తించిన సర్కారు.. వారికి కూడా పుణ్య స్నానాలు చేసే వెసులుబాటు కల్పించబోతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని 90 వేలకు పైగా ఖైదీలకు గంగా జలాలతో స్నానం చేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రయాగ్రాజ్లోని గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద నుంచి పవిత్ర జాలలను సేకరిస్తామని.. వాటిని అన్ని జైళ్లకు పంపిస్తామన్నారు. ఇలా ఫిబ్రవరి 21వ తేదీన ఆయా జైళ్లకు తీసుకెళ్లి ఖైదీలు సైతం స్నానాలు చేసే అవకాశం కల్పిస్తామన్నారు.
ఖైదీలంతా స్నానాలు చేసిన తర్వాత పూజలు, ఇతర క్రతువులు చేసేందుకు కూడా ఏర్పాట్లు కల్పిస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇందులో తాను కూడా పాల్గొంటానని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా యూపీ సర్కారు మంచి మనసుపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పటి వరకు కుంభమేళాలో మొత్తంగా 55 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలోనే 60 కోట్లకు పైగా జనాలు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa