ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక ఆ ఉద్యోగులకు 60 రోజుల సెలవులు, జీతం కూడా

national |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 07:47 PM

హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సుఖ్వీందర్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అండగా ఉండేందుకు మరో సంచలన నిర్ణయానికి తెరతీసింది. ఇప్పటినుంచి మహిళా ఉద్యోగులకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు మంజూరు చేయనుంది. అయితే ఈ సెలవులు అందరు మహిళా ఉద్యోగులకు మాత్రం కాదని హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తేల్చి చెప్పింది. గర్భిణీలకు డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా డెలివరీ తర్వాత బిడ్డను కోల్పోయిన ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు ఈ 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవును ఉంటుందని స్పష్టం చేసింది.


దీనికి సంబంధించి తాజాగా సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకు 180 రోజులు (6 నెలలు) ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. అయితే ఈ ప్రసూతి సెలవులకు ఎలాంటి అర్హతలు ఉండాలో.. కొత్తగా ప్రకటించిన ప్రత్యేక ప్రసూతి సెలవులకు కూడా అవే అర్హతలు అని హిమాచల్ సర్కార్ వెల్లడించింది. కానీ ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు మాత్రం డెలివరీ సమయంలో లేదా ఆ తర్వాత పుట్టిన శిశువు చనిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. అయితే గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో డెలివరీలు చేసుకున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.


9 నెలల పాటు కడుపులో మోసిన బిడ్డ.. కళ్లు తెరిచే సమయంలో, తెరిచిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం అంటే ఆ తల్లికి.. అంతకుమించిన శోకం ఇంకోటి ఉండదని హిమాచల్ ప్రభుత్వం తెలిపింది. అందుకే అలాంటి తీవ్ర విషాదకరమైన పరిస్థితుల కారణంగా వారికి కలిగే శారీరక, మానసిక బాధ నుంచి బయటికి వచ్చేందుకు ఈ 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవ్స్ ఉపయోగపడుతాయని పేర్కొంది.


ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహిళల ఆరోగ్యం, వారి శ్రామిక శక్తిని ఉపయోగించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతుందని తెలిపాయి. ఇక ఇలాంటి విధానాన్ని తీసుకురావడం ద్వారా మంచి పాలనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వెల్లడించాయి. ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని.. వారికి కష్ట సమయాల్లో మద్దతును అందిస్తుందని స్పష్టం చేశాయి.


ఇదే కాకుండా మరో కీలక నిర్ణయాన్ని కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి.. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేస్తున్న వారికి పూర్తి జీతాన్ని మంజూరు చేయడం ద్వారా హెల్త్‌కేర్ సెక్టార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు వేసిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa