ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే విమర్శలా,,, అతిశీ కామెంట్లపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఫైర్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 07:48 PM

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా అధికారంలోకి వచ్చి కొన్ని గంటలు కూడా కాకముందే.. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆప్ ఎమ్మెల్యే అయిన అతిశీ.. బీజేపీ ఎన్నికల వాగ్దాలనాలను నెరవేర్చలేదంటూ విమర్శలు చేశారు. దీనిపై తాజాగా సీఎం రేఖా గుప్తా స్పందించారు. 24 గంటలు కూడా గడవకముందే ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 సంవత్సరాలు పాలింటి ఢిల్లీకి ఏం చేశారో చెప్పాలని అడిగారు. మొదటి రోజే తాను క్యాబినెట్ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఢిల్లీలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఎమ్మెల్యే అతిశీ విమర్శించారు. ఢిల్లీ మహిళలను కాషాయ దళం మోసం చేస్తుందని.. మొదటి రోజే కేబినెట్ సమావేశంలోనే మహిళలకు రూ.2500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని బీజేపీ చెప్పినట్లు గుర్తు చేశారు. ఎన్నికల ముందు చెప్పిన ఈ మాటను ప్రస్తుత సీఎం మర్చిపోయినట్లున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు.


తాను అధికార బాధ్యతలు చేపట్టి 24 గంటలు కూడా కాలేదని.. ఇప్పుడే అలాంటి విమర్శలు ఎలా చేయగల్గుతారంటూ ప్రశ్నించారు. మాజీ సీఎం అతిశీ పేరు చెప్పకుండానే.. ఆమ్ ఆద్మీ పార్టీకి తమను విమర్శించే హక్కు లేదన్నారు. తొలి రోజే కాబినెట్ సమావేశం పెట్టి ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దాంతో పేద ప్రజలకు 10 లక్షల రూపాయల మేర వైద్య సహాయం అందబోతుందన్నారు. అంతేకాకుండా ఆప్ ఈ పథకాన్ని అమలు చేయలేదని గుర్తు సీఎం రేఖా గుప్తా గుర్తు చేశారు.


డబుల్ ఇంజిన్ సర్కారుతో బీజేపీ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8వ తేదీ నాటికి అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని.. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా పాలన అందిస్తామని అన్నారు. అంతేకాకుండా ఆప్ తమ పార్టీ గురించి పట్టించుకుంటే చాలని.. బీజేపీపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు.


ఎంతో మంది నేతలు ఆమ్ ఆద్మీ పార్టీని వీడాలనుకుంటున్నారని.. కాగ్ రిపోర్టును అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బయట పడతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ రిపోర్టులను అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రవేశ పెడతామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa