భారత్-పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ రేంజర్లు.. సరిహద్దు వెంట ఇష్టం వచ్చినట్లు కాల్పులకు తెగబడ్డారు. అయితే సరిహద్దుల్లో కాల్పులపై అలర్ట్ అయిన భారత్.. ఎదురుకాల్పులు జరిపి.. దాయాది సైనికులను సమర్థవంతంగా కట్టడి చేసింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. దీనికితోడు గురువారం సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద కదలికలను గుర్తించినట్లు భారత సైనిక ఉన్నతాధికారులు పేర్కొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్-పాక్ సైనిక అధికారులు సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు.
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ కాల్పులకు తెగబడగా.. ఈ పరిణామాలపై చర్చలు జరిపేందుకు జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్లో శుక్రవారం భారత్, పాక్ మిలిటరీ ఫ్లాగ్ మీటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇరుదేశాల మధ్య కీలక సమావేశం జరగనుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గురువారం పూంఛ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు సంచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద కదలికలతో అలర్ట్ అయిన భద్రతా దళాలు.. వారిపై ఎదురుకాల్పులు జరిపినట్లు వివరించారు
ఈ ఘటనతో పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని భారత సైన్యానికి చెందిన ఓ కీలక అధికారి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇటీవల భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన పరిణామాలపై రెండు దేశాల సైన్యాధికారులతో ఫ్లాగ్ మీటింగ్ జరగనుందని తెలిపారు. అయితే సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాక్ వైపు నుంచి కవ్వింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతవారం ఘాటి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. అయితే ఈ కాల్పులను భారత సైనికులు బలంగా తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో పాక్ వైపు పలువురు సైనికులు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ ఘటన కారణంగా రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి నష్టం జరగలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద కాల్పులు, ఐఈడీ పేలుడు సంభవించడంతో కొంత ఉద్రిక్త పరిస్తితి చోటుచేసుకుందని వెల్లడించింది. ఈనెల 4, 5వ తేదీల మధ్య అర్ధరాత్రి కొంతమంది చొరబాటుదారులు.. పాక్ వైపు నుంచి భారత్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా.. వారిపై భారత సైనికులు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు హతం అయ్యారు. ఆ తర్వాత కూడా పలుమార్లు జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa