వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. గ్రామ స్థాయి నాయకులు, వారి సతీమణుల ఫోన్ నంబర్లను ప్రైవేటు వ్యక్తులు సేకరిస్తున్నారని చెప్పారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన శుక్రవారం ములాఖత్లో కలిశారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘నా ఫోన్ను ట్యాప్ చేయడమే కాకుండా... అనధికారికంగా కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నంబర్లనూ సేకరిస్తున్నారు. ట్యాపింగ్లకు భయపడను. చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి విజయవాడలో అనధికారికంగా సిబ్బందిని నియమించుకుని ఫోన్లు చేసి వైసీపీ నేతలను బెదిరించాలని చూస్తున్నారు. రమేశ్ ఆస్పత్రి దగ్గర కార్యాలయం పెట్టి అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ఇదంతా కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లో జరుగుతోంది. వంశీ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఊహాజనిత ఫిర్యాదుతో ఆయనపై నాన్బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి ఆ కోర్టులో కాకుండా మరో కోర్టులో ఆయన్ను రిమాండ్కు పెట్టారు. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన సమయంలో నేను మచిలీపట్నంలో ఉంటే గుంటూరు వెళ్లానని కేసు నమోదు చేశారు’ అని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్ర పై విమర్శలు గుప్పించారు. పదేపదే తనను, కొడాలి నానిని అరెస్టు చేయిస్తామని చెబుతున్నారని.. 6 నెలలుగా మచిలీపట్నం రహదారులపై తిరుగుతున్నానని, రవీంద్ర చేయించే బొంగులో అరెస్టుతో తన రోమం ఊడదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa