ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాడు (ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే భారీ మొత్తంలో అమ్ముడు పోయాయి. దీంతో రేపు దుబాయ్ స్టేడియం ఫ్యాన్స్ హంగామాతో మోతెక్కిపోయవడం ఖాయం. ఇక టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో ఢీలాపడ్డ ఆతిథ్య పాకిస్థాన్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి. మరోవైపు టీమిండియా తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘన విజయంతో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. మరోవైపు యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ తన భీకరమైన ఫామ్ను కొనసాగిస్తూ శతకం బాదాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఫామ్లో ఉన్నా లేకపోయినా అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం మొదలైతే ఆపడం ఎవరితరం కాదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్, కోహ్లీలకు మించిన ప్లేయర్లు వర్తమాన క్రికెటర్లలో ఎవరూ లేరని యువీ కితాబిచ్చాడు. అలాగే రోహిత్, కోహ్లీలకు ఫామ్తో పనిలేదని, వన్డేల్లో వారిద్దరూ మ్యాచ్ విన్నర్లేనని యువరాజ్ తెలిపాడు. "రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నా లేకపోయినా అది నాకు ముఖ్యం కాదు. నేను ఎల్లప్పుడూ మ్యాచ్ విన్నర్లకు మద్దతు ఇస్తాను. వన్డే క్రికెట్లో ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్లలో విరాట్ కోహ్లీతో పాటు అతను బ్యాటర్గా భారత్కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్. రోహిత్ ఇబ్బంది పడుతున్నప్పటికీ పరుగులు సాధిస్తే అది ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరం. అతను ఫామ్లో ఉంటే 60 బంతుల్లో సెంచరీ బాదగలడు. కేవలం ఫోర్లే కాదు సిక్సర్లతోనే రన్స్ రాబట్టేస్తాడు. షార్ట్ పిచ్ బంతులను అద్భుతంగా ఆడగల అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. అలాగే 145-150 కి.మీ. వేగంతో వచ్చే బంతిని కూడా అలవోకగా హుక్ చేసి బౌండరీ దాటించే సామర్థ్యం అతని సొంతం. హిట్మ్యాన్ స్ట్రైక్ రేట్ ఎల్లప్పుడూ 120-140 మధ్య ఉంటుంది. అతని రోజున ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగలడు" అని యువరాజ్ సింగ్ జియో హాట్స్టార్లో మాట్లాడుతూ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa