ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. మార్చి 15వ తేదీ నుంచి అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో వివిధ రకాల పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పనుల్లో జాప్యమైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో టెండర్ల ఖరారులో ఆలస్యం జరిగింది. తాజాగా టెండర్లు పిలిచేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా టెండర్లను ఖరారు చేయొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు 62 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రూ.42 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే మరో 11 పనులకు కూడా టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. టెండర్లు పిలిచేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. మార్చి 15 నుంచి అమరావతిలో పనులు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ నుంచి జోరందుకోనున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి 30 వేల మంది కార్మికులతో అమరావతిలో పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యన అధికారంలో ఉన్న సమయంలో రాజధాని అమరావతిలో ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే దీనికి శంకుస్థాపన జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావటంతో ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం నిర్మాణం అటకెక్కింది. ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో ఎన్ఆర్టీ ఐకాన్ భవనం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం నిర్మాణ కమిటీని నియమించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈవో మెంబర్ కన్వీనర్గా, టర్నర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి ఒక సాంకేతిక సభ్యుడు, ఐదుగురు సభ్యులు ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa