ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి ఐదు కేజీల బంగారం చోరీ కేసును చేధించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 07:22 PM

మంగళగిరిలో కలకలం రేపిన ఐదు కేజీల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల్లోనే అసలు నిందితులను గుర్తించారు. బాధితుడే అసలు సూత్రధారిగా పోలీసులు తేల్చారు, ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద స్కూటీని అటకాయించి నాలుగు కోట్ల రూపాయల విలువైన 5 కేజీల బంగారం దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. యజమానికి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. చేరీ చేసింది ఎవరనేదీ గుర్తించారు.


దురాశ దుఃఖానికి చేటు.. ఇది పెద్దలు చెప్పే మాట. పెద్దల మాట చద్దన్నం మూట అని, అనుభవంతో వారు చెప్పే మాటలను వినాలని అందరూ చెప్తుంటారు. కానీ అలా వినకుండా అత్యాశతో ఓ వ్యక్తి చేసిన పని.. ఇప్పుడు అతను ఊచలు లెక్కపెట్టేలా చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన దివి రాము అనే వ్యక్తి విజయవాడలో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ దుకాణంలో దివి నాగరాజు అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డ్యూటీలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన దివి నాగరాజు బంగారు నగలను తీసుకుని స్కూటీపై వస్తున్నారు. సుమారుగా రూ. 4 కోట్లు విలువైన 5 కేజీల బంగారం నగలను ఓ సంచీలో పెట్టుకుని స్కూటీపై వస్తున్నారు. అయితే మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్‌లోని అండర్‌ పాస్‌ వద్దకు రాగానే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. స్కూటీని అటకాయించారు.


దివి నాగరాజును బెదిరించిన ఇద్దరు యువకులు, స్కూటీకి తగిలించిన సంచీని లాక్కుని పారిపోయారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ యజమానికి సమాచారం చేరవేశారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏకంగా ఐదు కేజీల బంగారం చోరీ కావటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అలాగే బాధితుడు దివి నాగరాజు కదలికలపైనా దృష్టిపెట్టారు. పోలీసుల అనుమానాలే నిజమయ్యాయి. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దివి నాగరాజు ఈ చోరీ చేయించినట్లు తెలిసింది. నాగరాజు తన స్నేహితులతో కలసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు తేలింది.


తనకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని, చెల్లెలికి పెళ్లి కూడా చేయాలంటూ స్నేహితులను నమ్మించిన నాగరాజు.. వారిని కూడా ఈ చోరీ ఉచ్చులోకి లాగాడు. పోలీసులకు భయపడి స్నేహితులు తొలుత ముందుకు రాలేదు. అయితే వారికి ఏమీ కాదంటూ, ఆంతా తాను చూసుకుంటానంటూ నమ్మించిన నాగరాజు.. బంగారం చోరీ చేసేందుకు తనకు సహకరించాలని కోరాడు. అనంతరం ప్లాన్ ప్రకారం దివి నాగరాజు స్కూటీని అతని స్నేహితుడు భరత్, మరో వ్యక్తి అడ్డగించారు. బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడంతో పాటుగా బాధితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. చోరీకి గురైన ఐదు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa