త్రిభాషా విధానంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. జాతీయ విద్యా విధానం (ఎన్పీఈ) ద్వారా రాష్ట్రంపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపిస్తుంది. దీనికి నిరసనగా ‘ఎక్స్’ లో ‘గెట్ ఔట్ మోదీ’ అంటూ ప్రచారం చేసింది. దీనికి కౌంటర్గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ‘గెట్ ఔట్ స్టాలిన్’ అంటూ ప్రచారం అందుకున్నారు. ఈ విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్పీపీ అమలుకు ఒప్పుకుంటే నిధులను విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు.
అయితే, రూ. 10వేల కోట్లిచ్చినా ఆ విద్యావిధానాన్ని తాము అమలుపరిచే ప్రసక్తేలేదని స్టాలిన్ ప్రకటించారు. కడలూరు జిల్లాలో ‘తల్లిదండ్రులను గౌరవిద్దాం’ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని శనివారం భారీఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ మాట్లాడుత.. జాతీయ విద్యావిధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమగ్ర శిక్షా అభియాన్ పథకం అమలుకు కేంద్రం తరఫున చెల్లించాల్సిన రూ.2152 కోట్ల నిధులను అకారణంగా నిలిపేశారని ఆరోపించారు. మోదీ సర్కారు నిర్వాకంతో ఆ పథకంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు లేకుండా చేశారని దుయ్యబట్టారు.
ఓపక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యా నాణ్యత పెరిగిందని ప్రశంసిస్తూనే.. మరోనక్క తమిళనాడుకు రావాల్సిన ఎస్ఎస్ఏ నిధులను నిలిపేసిందని విమర్శించారు. జాతీయ విద్యా విధానాన్ని తాము ఒప్పుకోవడం లేదనే కారణంతో ఈ నిధులను ఇవ్వడానికి నిరాకరిస్తోందని మండిపడ్డారు. జాతీయ విద్యావిధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదన్న తమిళనాడు సీఎం.. రాష్ట్రంలో హిందీభాషను నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. కానీ, భాషను నిర్బంధంగా అమలు చేయాలన్న ఆలోచననే దశాబ్దాల తరబడి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa