ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాది నుంచి మళ్లీ బీఈడీ, ఎంఈడీ ఒక ఏడాదే

national |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 09:10 PM

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్‌) లను తిరిగి ఒకే ఏడాది కోర్సులుగా నిర్వహించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) భావిస్తోంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. వాస్తవానికి దశాబ్దం కిందటి వరకూ ఇవి ఏడాది కాలపరిమితి కోర్సులుగానే ఉండేవి. కానీ, వీటి కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించారు. తాజాగా, ఏడాదికి కుదిస్తూ ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు అభిప్రాయాలను స్వీకరించనుంది.


ఈ పాలసీ ఆమోదం పొందిన తర్వాత స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు (టీఈఐ) కొత్త ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా ఉంటే, రెండేళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందించడం కొనసాగించవచ్చు. లేదా ఒక ఏడాది ఫార్మాట్‌లో మారేందుకు వీలు ఉంటుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రామాణిక సబ్జెక్ట్‌, ఆప్టిట్యూట్‌ టెస్ట్ నిర్వహించనుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం వెలువరించింది. ప్రస్తుతం ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ల (ఐటీఈపీ) ప్రవేశాల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్‌సీఈటీ)ను ఎన్టీఏ నిర్వహిస్తోంది.


ఎన్టీఏ నిర్వహించే కొత్త ఐటీఈపీ కోర్సుల ప్రవేశ పరీక్షకు సంబంధించిన విధివిధానాలు వచ్చే ఏడాది రూపొందిస్తామని ఎన్‌సీటీఈ చైర్‌పర్సన్‌ పంకజ్‌ అరోరా వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఐటీఈపీ యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సంస్కృత విద్య, కళా విద్య అనే నాలుగు ప్రత్యేక కోర్సులను తీసుకురానున్నట్లు ఎన్‌సీటీఈ తన ముసాయిదా నిబంధనలు-2025లో స్పష్టం చేసింది. కొత్త కోర్సులతో పాటు కనీస మౌలిక సౌకర్యాలు, అధ్యాపకులు వంటి అంశాలను కూడా ఇందులో నిర్దేశించింది.


ముసాయిదా తాజా నిబంధనల ప్రకారం.. కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ప్రత్యేక సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) పూర్తిచేసినవారు ఒక ఏడాది బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. ఇన్ సర్వీస్ టీచర్లకు రెండేళ్ల ఎంఈడీ ప్రోగ్రామ్‌ అందజేయనున్నట్టు ముసాయిదా పేర్కొంది. జాతీయ విద్యావిధానం సిఫారసుల మేరకు ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు అరోరా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa