మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ హైకోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. భూపాలపల్లికి చెందిన రాజలింగం రెండ్రోజుల క్రితం తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తండగా.. దుండగులు కత్తులు, గొడ్డళ్లతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ హత్య తెలంగాణలో సంచలనం సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు విచారణ నేపథ్యంలో పిటిషనర్ హత్యకు గురికావటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
రాజలింగం హత్య వెనుక మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామిరెడ్డి హస్తం ఉందని మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. మంత్రి కామెంట్లపై కౌంటర్ ఇచ్చిన గండ్ర.. సీబీసీఐడీ వేసినా ఏ అభ్యంతరం లేదని.. అతడిపై భూతగాదాలకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయని.. ఆ కక్షతోనే చంపి ఉంటారని చెప్పారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారించి మర్డర్ మిస్టరీని ఛేదించారు.
భూవివాదమే హత్యకు కారణమని పోలీసులు ఫైనల్గా గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కీలక విషయాలు వెల్లడించారు. హత్యలో మెుత్తం 10 మంది పాల్గొనగా.. ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. రాజలింగమూర్తికి ఏ1గా ఉన్న సంజీవ్ మధ్య గత కొంతకాలంగా ఎకరం స్థలానికై భూవివాదం నడుస్తోందన్నారు. ఈ క్రమంలో రాజలింగమూర్తిని హత్య చేయాలని పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలిపారు. సింగరేణి కాలరీస్ రోడ్డులో కాపు కాసి.. బైక్పై వస్తున్న అతడి కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి దారుణంగా చంపేసినట్లు తెలిపారు.
ఏ1 రేణిగుంట్ల సంజీవ్, ఏ4 కొత్తూరు కిరణ్ సహా మరో ఇద్దరు వ్యక్తులు హత్యలో నేరుగా పాల్గొన్నారని చెప్పారు. మిగతా ఆరుగులువారితో టచ్లో ఉన్నట్లు వివరించారు. అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను రిమాండ్కు పంపి.. పరారీలో ఉన్న మరో ముగ్గరు కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa