ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజమహేంద్రవరం శివార్లలో ఉన్న దివాన్ చెరువు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివాన్ చెరువు వద్ద 2.55 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతవాసులు ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే 16వ నంబర్ జాతీయ రహదారి, నేషనల్ హైవే 216A మధ్య అనుసంధానం పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. అలాగే రద్దీ తగ్గుతుందని, రోడ్డు భద్రతను మెరుగుపరుస్తుందని చెప్తున్నారు.
రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకోవటంతో కేంద్రం నుంచి ఆమోదం లభించింది. దివాన్ చెరువు జంక్షన్ వద్ద వాహనాల రద్దీ, వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని దగ్గుబాటి పురందేశ్వరి గత కొంతకాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు దివాన్ చెరువు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. మరోవైపు సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు నిత్యం ఇక్కడి నుంచి కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పాదచారులతో పాటుగా వాహనాల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు.
రూ.327 కోట్ల ఖర్చుతో 2.55 కిలోమీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే దివాన్ చెరువు జంక్షన్, గామన్ బ్రిడ్జి జంక్షన్, పండ్ల మార్కెట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను లింక్ చేస్తూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు తీరటంతో పాటుగా రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa